ప్రభుత్వ ఉద్యోగం పెట్టిస్తానని రూ.20 లక్షలకు ఒప్పందం
కజిన్ బ్రదర్ అరెస్ట్.. రిమాండ్
సీసీసీ నస్పూర్, మే 10 : నిరుద్యోగులైన అక్కాబావలు కజిన్ బ్రదర్ను నమ్మి పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టజెప్పారు. చివరికి మోసం జరిగిందని తెలుసుకొని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో దాటవేస్తూ వచ్చాడు. బాధితులు సీసీసీ నస్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కజీన్ బ్రదర్ చేసిన మోసం కాస్త బయటకు వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సోమవారం సీసీసీ నస్పూర్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంచిర్యాల ఏసీపీ అఖిల్ మహాజన్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సంతోష్నగర్-భాగ్యనగర్కు చెందిన యువకుడు ముద్దసాని అభిలాష్ 2016లో హోటల్ మేనేజ్మెంట్లో డిగ్రీ పూర్తి చేశాడు. హైదరాబాద్లోని క్షత్రియ హోటల్లో ఫ్రంట్ ఆఫీస్ అసోసియేట్గా పనిచేస్తున్నాడు. వచ్చే జీతం సరిపోకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగాలు పెట్టిస్తానంటూ మోసాలకు తెరలేపాడు.
నకిలీ ఉద్యోగ నియామక పత్రాలు అందించి..
సీసీసీ నస్పూర్లో నివాసముంటున్న పెద్దమ్మ కూతురైన గంధం మమత, ఆమె భర్త గంధం రాజన్న నిరుద్యోగులు. అక్కాబావలను వీఆర్వో ఉద్యోగాల్లో పెట్టిస్తానని అభిలాష్ మాయమాటలు చెప్పాడు. ఇందుకు రూ.20లక్షలు ఖర్చు అవుతుందని చెప్పాడు. అతడిని నమ్మిన వారిద్దరూ రూ.19.60 లక్షలు ముట్టజెప్పారు. ఇందులో కొంత నగదు ఇవ్వగా, మరికొంత అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేశారు. తర్వాత అభిలాష్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేరుతో వీఆర్వో ఉద్యోగానికి జాయినింగ్ డేట్కు (ప్రొసీడింగ్ నం.ఈ1/11 05/2019) సంబంధించిన నకిలీ డాక్యుమెంట్ తయారు చేశాడు. దానిపై అప్పటి టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ సంతకాలు ఫోర్జరీ చేశాడు. వీఆర్వో ఉద్యోగ నియామకానికి సంబంధించిన నకిలీ ప్రొసీడింగ్ ఆర్డర్ కాపీని 4.10.2019 రోజున బావ గంధం రాజన్నకు అందజేశాడు. అక్క మమతకు ఎల్డీసీ ఉద్యోగానికి సంబంధించిన అపాయింట్మెంట్ నకిలీ ఆర్డర్స్ కాపీని ఇచ్చాడు. కొద్దిరోజులకు వీఆర్వో ఉద్యోగాలు రద్దయినట్లు వారిని నమ్మించాడు. వీటికి బదులుగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తానని మరోసారి నమ్మబలికాడు. కానీ, గంధం రాజన్న ఇందుకు ఒప్పుకోలేదు. దీంతో అభిలాష్ గతేడాది మార్చి 6న వీరి వద్ద తీసుకున్న రూ.19.60 లక్షలను అదే నెల 30వ తేదీన తిరిగి ఇస్తానని పెద్దమనుషుల సమక్షంలో ఒప్పుకొని లిఖితపూర్వకంగా రాసిచ్చాడు.
జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం పెట్టిస్తానని 2.6.2020 రోజు మరో నకిలీ ఉద్యోగ నియామక పత్రాన్ని తయారు చేసి, దానిపై కరీంనగర్ జిల్లా గంగాధర మండల రెవెన్యూ ఆఫీసర్ సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. మమతకు 3.6.2020 రోజున జూనియర్ అసిస్టెంట్ పోస్టు కోసం మరో నకిలీ ఉద్యోగ నియామక పత్రాన్ని తయారు చేసి దానిపై కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల రెవెన్యూ ఆఫీసర్ సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. వాటిని ఇద్దరికీ ఇచ్చాడు. ఇవి నకిలీ ఉద్యోగాలు అని తేలడంతో ఇచ్చిన డబ్బుల కోసం అభిలాష్ను అక్కాబావలు డిమాండ్ చేశారు. అయినప్పటికీ ఇబ్బంది పెట్టడంతో చివరికి సీసీసీ పోలీస్స్టేషన్లో మూడు రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. సోమవారం నస్పూర్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద అభిలాష్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ వివరించారు. సీఐ కుమారస్వామి, ఏఎస్ఐ మధుసూదన్, హెడ్కానిస్టేబుల్ రవూఫ్ తదితరులు పాల్గొన్నారు.