లండన్ : నెలసరి రుతు సమస్యల వల్ల బాలికలు ఎవరూ విద్యకు దూరం కావొద్దు. ఈ నినాదంతోనే ఫ్రీపీరియడ్స్ సంస్థను .. భారతీయ సంతతి అమ్మాయి అమికా జార్జ్ లండన్లో స్థాపించింది. రుతు సమస్యలతో బాధపడుతున్న విద్యార్థినిలకు ఆ సంస్థ అవసరమైన ప్యాడ్స్ సరఫరా చేస్తోంది. అయితే బ్రిటీష్ రాణి బర్త్డే సందర్భంగా ప్రదానం చేసే మెంబర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద బ్రిటీష్ అంపైర్ జాబితాలో అమికా జార్జ్ ఎంపికైంది. బ్రిటీష్ పురస్కారాల్లో ఎంబీఈ అవార్డులను మూడవ అత్యున్నత అవార్డులుగా భావిస్తారు. పీరియడ్స్ పట్ల అవగాహన కల్పిస్తున్న అమికా జార్జ్కు క్వీన్స్ ఎంబీఈ అవార్డు దక్కడం అభినందనీయం.
అమికా జార్జ్ తల్లితండ్రులు కేరళకు చెందినవారు. అయితే బ్రిటన్లోని స్కూళ్లు, కాలేజీల్లో స్థానిక ప్రభుత్వ సహకారంతో పీరియడ్స్ ప్రోడక్ట్స్ అందజేస్తున్నది. క్యాంబ్రిడ్జ్ వర్సిటీలో విద్యనభ్యసిస్తున్న 21 ఏళ్ల అమికా తనకు అవార్డు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది. యువత ప్రభుత్వాన్ని శాసించగలదని, ఎంబీఈ అవార్డు రావడం అంటే, అది మార్పుకు సంకేతమని ఆమె అన్నారు. వెస్ట్మిన్స్టర్, వైట్హౌజ్, ఇండియన్ పార్లమెంట్ నుంచే మార్పు రాదు అని, మార్పు ఎవరైనా తీసుకువస్తారని ఆమె అన్నారు. 17 ఏళ్ల వయసులోనే ఫ్రీ పీరియడ్స్ ఉద్యమాన్ని అమికా స్టార్ట్ చేసింది. ప్యాడ్స్ లాంటి అవసరమైన ఉత్పత్తులు లేక స్కూల్కు దూరమవుతున్న వారి కోసం ఆమె ఈ క్యాంపేన్ మొదలుపెట్టింది.
రుతుక్రమ సమస్యలకు సంబంధించి అవసరమైన ఉత్పత్తులను పంపిణీ చేసేందుకు 2020లో బ్రిటన్ ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకువచ్చింది. అప్పటి నుంచి అక్కడ స్కూళ్లు, కాలేజీల్లో ప్యాడ్స్ సరఫరా చేస్తున్నారు. ఈ ఏడాది ఆర్డర్ ఆఫ్ బ్రిటీష్ అంపైర్ జాబితాలో 1129 మంది ఉన్నారు. దాంట్లో 50 శాతం మంది మహిళలే ఉండడం విశేషం.