భోపాల్ : ఓ సాధ్వీ మనిషి పుర్రె, ఎముకలు కలిగిన బ్యాగుతో విమానం ఎక్కబోయి పోలీసులకు దొరికిపోయింది. సాధ్వీ యోగ్మాతా సచ్దేవ్ అనే మహిళ.. ఉజ్జయిన్ నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు ఇండోర్ ఎయిర్పోర్టుకు వచ్చింది. ఈ క్రమంలో సాధ్వీ బ్యాగును సీఐఎస్ఎఫ్ అధికారులతో పాటు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. దీంతో ఆమె బ్యాగులో మనిషి పుర్రె, ఎముకలు బయటపడ్డాయి.
ఈ అస్తికలను గంగా నదిలో కలిపేందుకు హరిద్వార్ వెళ్తున్నానని సాధ్వీ పోలీసులకు తెలిపింది. ఈ విషయాన్ని ఎయిర్పోర్టు అధికారుల దృష్టికి పోలీసులు తీసుకెళ్లారు. దీంతో ఇండోర్ ఎయిర్పోర్టు మేనేజ్మెంట్ ఆమెను ఆపేశారు. ఇక ఆ అస్తికలను వేరే సాధువులు తీసుకొని రోడ్డు మార్గం గుండా హరిద్వార్కు వెళ్లారు. సాధ్వీ యోగ్మాతా మరో ఫ్లైట్లో ఢిల్లీకి వెళ్లారు.