న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్ నుంచి భారతీయులను స్వదేశానికి తరలించే ఆపరేషన్కు దేవి శక్తిగా నామకరణం చేశారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆపరేషన్ దేవి శక్తి కొనసాగుతున్నదని, తాజాగా కాబూల్ నుంచి 78 మంది భారతీయులు దుశాంబే మీదుగా భారత్కు చేరుకున్నారని ఆయన ట్వీట్ చేశారు. అదేవిధంగా అలుపెరుగని సేవలందిస్తున్న భారత వాయుసేనకు, ఎయిర్ ఇండియాకు, విదేశాంగశాఖ సిబ్బందికి మంత్రి జయశంకర్ సెల్యూట్ చేశారు.
ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్లో పరిస్థితి అల్లకల్లోలంగా ఉన్నది. వారం రోజుల క్రితం తాలిబన్లు దేశాన్ని టేకోవర్ చేయడంతో ఆ దేశంలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. తాలిబన్లు మహిళలను, చిన్నారులను, గత ప్రభుత్వ మద్దతుదారులను వేధింపులకు గురిచేస్తున్నది. ఈ నేపథ్యంలో భారత్ సహా అమెరికా తదితర దేశాలు ఆఫ్ఘనిస్థాన్ నుంచి తమ పౌరులను స్వదేశానికి చేరుస్తున్నాయి. ఈ క్రమంలో భారత్ చేపట్టిన తరలింపు ఆపరేషన్కు ఆపరేషన్ దేవిశక్తి అని నామకరణం చేశారు.