న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రభావం క్రమంగా తగ్గిపోతున్నది. గత మే నెలలో వరుసగా కొన్ని రోజులపాటు నాలుగు లక్షలకు పైనే నమోదైన రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పుడు 40 వేల దిగువకు చేరుకుంది. అయితే, కరోనా మహమ్మారి ప్రభావం తగ్గినా దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మాత్రం శరవేగంగా కొనసాగుతున్నది. రోజూ లక్షల మందికి వ్యాక్సిన్లు వేస్తున్నారు.
సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు గడిచిన 24 గంటల్లో మొత్తం 45,82,246 మంది కరోనా వ్యాక్సిన్లు తీసుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. మంగళవారం ఉదయం 7 గంటల వరకు అందిన ప్రొవిజినల్ రిపోర్టు ప్రకారం.. దేశంలో మొత్తం 35.75 కోట్లకు పైగా (35,75,53,612) వ్యాక్సిన్ డోసులు పంపిణీ అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.