మహబూబ్నగర్, మార్చి 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించడడంతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు జెట్ స్పీడ్ అందుకోనున్నాయి. మూడు రోజులుగా నిత్యం ఈ ప్రాజెక్టుపై సమీక్షలు నిర్వహిస్తూ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. రెండ్రోజుల పాటు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహించారు. మంగళవారం నీటి పారుదల శాఖ అధికారులు, ఎమ్మెల్యేలు భేటీ కూడా అయ్యారు. సీఎం కేసీఆర్, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షలు నిర్వహించి చర్చించారు. ప్రగతిభవన్లో సాగిన సమావేశంలో కల్వకుర్తి, పాలమూరు ఎత్తిపోతల పథకాల పనులు విస్తరించడం కోసం సిద్ధం చేసుకోవాల్సిన ప్రణాళికలను, అనుసరించాల్సిన కార్యాచరణను సీఎం క్షుణ్ణంగా వివరించారు. దీంతో ఉమ్మడి జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేసే పాలమూరు పథకాన్ని పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి భగీరథ ప్రయత్యాన్ని రైతులు స్వాగతిస్తున్నా రు. వెంటనే పెండింగ్ భూసేకరణ పనులపై ప్రత్యేక దృష్టి సారించేందుకు రంగం సిద్ధమైంది.
తీరనున్న నీటి గోస
పాలమూరు ఎత్తిపోతల పథకం పనులు వేగంగా జరుగుతున్నాయి. నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉదండాపూర్ రిజర్వాయర్లు, పంప్హౌస్ల నిర్మాణం కొనసాగుతున్నది. మొత్తం 18 ప్యాకేజీల్లో పనులు వేగాన్ని అందుకున్నాయి. ఒక్కో రిజర్వాయర్, పంప్హౌస్ వద్ద వెయ్యిమంది సిబ్బంది 24 గంటలపాటు శ్రమిస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి పనులను పూర్తిచేసి వచ్చే వర్షాకాలం నాటికి పూర్తి చేస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం ద్వారా 6 జిల్లాల పరిధిలో 12,30,000 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటి వరకు దాదాపుగా రూ.11 వేల కోట్లు ఖర్చు చేశారు. ప్రస్తుత బడ్జె ట్లో రూ.960 కోట్లు కేటాయించడంతో పనులు త్వర గా పూర్తయ్యేందుకు అవకాశం ఏర్పడింది. అవసరమైతే మరిన్ని అదనపు నిధులను విడుదల చేసేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. ఇంకా 3,349 ఎకరాల భూసేకరణ చేపట్టాల్సి ఉండగా… పలు చోట్ల కీలకమైన కాలువల నిర్మాణానికి భూసేకరణే అడ్డుగా మారింది. ఈ విషయంలో ప్రత్యేక దృష్టి సారించేందుకు సిద్ధమైంది.
పాలమూరుతో కల్వకుర్తి అనుసంధానం
కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో రిజర్వాయర్ల సామర్థ్యం తక్కువగా ఉండటంతో దాని పరిధిలోని ఆయకట్టుకు నీరందడం కష్టంగా మారింది. ఈ తరుణంలో ఆయకట్టును పూర్తి స్థాయిలో స్థిరీకరించేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. పాలమూరు లిఫ్టు పనులను వేగంగా చేపట్టి ఎక్కడికక్కడే అనుసంధానం చేసుకోవాలని అధికారులకు సూచించారు. జడ్చర్ల సమీపంలో నిర్మిస్తున్న ఉదండాపూర్ రిజర్వాయర్ ద్వారా కొడంగల్, నారాయణపేట నియోజకవర్గాల పరిధిలో సాగు భూములకు గ్రావిటీ ద్వారా నీరందించే అవకాశాలను సీఎం పరిశీలించడంతో పాటు పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించారు. దీనిపై మంగళవారం నారాయణపేట, కొడంగల్ ఎమ్మెల్యేలు రాజేందర్రెడ్డి, నరేందర్రెడ్డి కూడా అధికారులతో జరిగిన సమీక్షలో పాల్గొన్నారు. కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో నీరందకుండా ఉన్న సాగు భూములను కూడా తడపాలన్న ఆలోచన మేరకు అధికారులు అడుగులు వేస్తున్నారు. వీలైనంత వరకు గ్రావిటీ ద్వారా మహబూబ్నగర్ జిల్లా చుట్టూ నీటిని ఎలా తీసుకెళ్లాలో అని ముఖ్యమంత్రి వివరించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా చేపట్టాల్సిన భూసేకరణ, నిర్వాసితులకు ఇవ్వాల్సిన ఆర్అండ్ఆర్ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు. మరోవైపు ఈ ప్రాజెక్టు పనులను క్రమంతప్పకుండా సమీక్షించేందుకు ప్రాజెక్టు పరిధిలో ఓగెస్ట్ హౌస్ నిర్మించాలని సీఎం ఆదేశాలమేరకు అనువైన స్థలం కోసం అధికారులు కసరత్తు చేపట్టారు.