న్యూఢిల్లీ : ‘భారతీయులు అన్ని మతాలను సమదృష్టితో గౌరవిస్తున్నారు. ఇండియాలో మెజారిటీ ప్రజలు మతస్వేచ్ఛను అనుభవిస్తున్నారు. పరమత సహనం భారతీయుల, భారతదేశ ఆత్మ’ అని అమెరికాకు చెందిన మేధో సంస్థ ‘ప్యూ రిసెర్చ్ సెంటర్’ తాజా నివేదికలో పేర్కొన్నది. 2019 నవంబర్ నుంచి 2020 మార్చి మధ్యలో ఇండియాలో వివిధ మతాలకు చెందిన 30వేల మందిపై సర్వే చేసి ఈ విషయాన్ని వెల్లడిందింది. సర్వేలో భాగంగా 17 భాషల్లో, దేశంలోని అన్ని రాష్ర్టాలకు చెందిన ప్రజలను ప్రశ్నలు అడిగారు. 97శాతం మంది భారతీయులు తాము దేవుణ్ని నమ్ముతున్నట్టు చెప్పారు. మత విశ్వాసాలు పాటించడంతో తాము పూర్తి స్వేచ్ఛను కలిగి ఉన్నామని అన్ని ప్రధాన మతాలకు చెందిన ప్రజలు చెప్పారు. అంతేగాక ఈ సర్వే ప్రకారం.. వచ్చే నాలుగు దశాబ్దాలు ప్రపంచవ్యాప్తంగా చూస్తే క్రైస్తవమే అతిపెద్ద మతంగా ఉంటుంది. ముస్లింల జనాభా రేటు వేగంగా పెరుగుతున్నది. ఇలాగే పెరిగితే 2050 నాటికి జనాభా 930 కోట్లకు పెరుగుతుంది. అప్పటికి ముస్లిం జనాభా 280 కోట్లు, క్రిస్టియన్ జనాభా 290 కోట్లు ఉండొచ్చని ప్యూ సర్వే పేర్కొన్నది.