న్యూఢిల్లీ, ఆగస్టు 13: భారతదేశంలోని ఐఐటీలు, ఐఐఎంలు, కొన్ని ప్రఖ్యాత యూనివర్సిటీల్లో కోర్సులకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. చాలా మంది విద్యార్థులు ఆ యూనివర్సిటీల్లో సీట్లు దొరక్క విదేశాలకు వెళ్లి అక్కడ వర్సిటీల్లో చేరతారు. ఈ పరిస్థితిని నివారించాలని కేంద్రం సంకల్పించింది. భారతదేశంలోని టాప్ యూనివర్సిటీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలు విదేశాల్లో కూడా తమ క్యాంపస్లను ఏర్పాటు చేసుకొనేందుకు అనుమతించింది. తద్వారా విద్యార్థుల వలసలను అడ్డుకోవచ్చని, భారత వర్సిటీలకు అంతర్జాతీయ ఖ్యాతి లభిస్తుందని భావిస్తున్నది. తొలిదశలో కేంద్రప్రభుత్వం ఎంపిక చేసిన కొన్ని వర్సిటీలు తమ క్యాంపస్లను విదేశాల్లో ఏర్పాటు చేస్తాయి. ఈ వర్సిటీల జాబితాను కొన్ని వారాల్లో విడుదల చేస్తారని సమాచారం. భారత వర్సిటీలు.. విదేశీ విద్యాసంస్థలతో ఒప్పందం చేసుకొని వాటికి మాత్రమే ప్రత్యేకమైన కోర్సులను కూడా బోధించనున్నాయి. దీనికోసం క్రెడిట్ సిస్టమ్ను ప్రవేశపెట్టనున్నారు. అంటే భారత వర్సిటీలో ఉన్నత విద్య చదివిన అనంతరం వేరే వర్సిటీలో ఉన్న కోర్సును అధ్యయనం చేయాలంటే మళ్లీ అక్కడ ప్రవేశం పొందాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు చదువుకొన్న వర్సిటీలోనే ఆ కోర్సును కూడా బోధిస్తారు.