తిరుమలగిరి మే 4 : రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మద్దతు ధర అందించాలనే లక్ష్యంతో గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. రైతుల వద్ద ఉన్న పూర్తి స్థాయి ధాన్యాన్ని కొనుగోలు చేయడమే లక్ష్యంగా అధికారులు సైతం కొనుగోళ్లను వేగవంతం చేశారు. రైతులు నాణ్యమైన ధాన్యం తెస్తే మద్దతు ధర రూ. 1888 చెల్లిస్తున్నారు. ధాన్యం దిగుమతిలో ఇబ్బందులు ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ధాన్యం విక్రయించిన వెంటనే రసీదు
రైతులు ధాన్యం విక్రయించిన వెంటనే రసీదు అందిస్తున్నారు. రైతులు కూడా ఓచర్ను తప్పక తీసుకోవాలని, లేని పక్షంలో నిర్వాహకులతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. కాంటాల్లో మోసం జరిగినట్లు అనుమానం వస్తే మరోచోట తూకం వేసి చూసుకోవచ్చు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకం వేశాక, బస్తాలు కుట్టే సమయంలోనూ జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. రైతులకు రసీదులో ఎంత తూకం ఉందో మిల్లుల వద్ద కూడా అంతే తూకం రావాల్సి ఉంటుంది. ఒకవేళ నిర్వాహకులు, హమాలీలు అవకతవకలకు పాల్పడితే కొనుగోలు కేంద్రాన్ని రద్దు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ముమ్మరంగా కొనుగోళ్లు
20 రోజుల నుంచి వివిధ కారణాలతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటాలు వేయక పోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో సివిల్ సైప్లె అధికారులు కాంటాలు వేగవంతమయ్యేలా చర్యలు తీసుకున్నారు. కేంద్రాల నిర్వాహకులకు, మిల్లర్లకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూ కొనుగోళ్లు ముమ్మరంగా జరిగేలా చూస్తున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా కొనుగోళ్లు ఊపందుకున్నాయి.
మిల్లుల వద్ద పర్యవేక్షణ
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో ఆలస్యం కాకుండా ఉండేందుకు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రతి మిల్లు వద్ద వీఆర్వోను నియమించారు. క్వాలిటీలో తేడా ఉంటే జిల్లా టెక్నికల్ అధికారులకు సమాచారం ఇవ్వాలని అధికారులు మిల్లర్లకు సూచిస్తున్నారు. దీంతో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు కలుగకుండా చూసేందుకు డీటీ, ఆర్ఐ స్థాయి అధికారులను నియమించారు. ఏమైనా ఫిర్యాదులుంటే వెంటనే పరిష్కరిస్తున్నారు.
ధాన్యం కొనుగోళ్లలో ప్రథమస్థానం
యాసంగి ధాన్యం కొనుగోళ్లలో సూర్యాపేట జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచినట్లు సివిల్సైప్లె అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 2,22,945 మెట్రిక్టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. మొత్తం 26,580 మంది రైతులకు రూ. 421 కోట్లు చెల్లించాల్సిఉండగా.. ఇప్పటి వరకు 11,635 మంది రైతులకు రూ. 209 కోట్లు చెల్లించారు. ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి.