చ.అ. రూ. 1,61,670 l ముంబైలో కొనుగోలు చేసిన డీమార్ట్ అధినేత దమానీ
ముంబై: సూపర్ రిటైల్ మార్కెట్ దిగ్గజం డీమార్ట్ అధినేత రాధాకిషన్ దమానీ.. ముంబైలో ఏకంగా రూ.1,001 కోట్లతో ఓ ఇంటిని కొనుగోలు చేశారు. దక్షిణ ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన మలబార్ హిల్లోగల ఈ రెండంతస్తుల భవనం విస్తీర్ణం 61,916.3 చదరపు అడుగులు (దాదాపు 1.5 ఎకరాలు). చదరపు అడుగుకు రూ. 1,61,670 వెచ్చించారు. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ వివరాల ప్రకారం దీని మార్కెట్ విలువ రూ.724 కోట్లు. రాయ్చంద్ అండ్ సన్స్కు చెందిన పురచంద్, పరేశ్చంద్, ప్రేమ్చంద్ల నుంచి ఈ ఇల్లును గత నెల 31న తన సోదరుడు గోపీకిషన్ దమానీతో కలిసి రాధాకిషన్ దమానీ కొన్నారు. ఈ సందర్భంగా రూ.30.03 కోట్లను స్టాంప్ డ్యూటీగా చెల్లించడం గమనార్హం. ఇప్పటికే ముంబైలోని విలాసవంతమైన ఆల్టమౌంట్ రోడ్డులో దమానీకి ఓ ఇల్లున్నది. ఈ ప్రాంతాన్ని లండన్లోని ‘బిలియనీర్స్ రో’తో పోలుస్తారన్న విషయం తెలిసిందే. కాగా, హురున్ ఇండియా ఈ ఏడాది విడుదల చేసిన శ్రీమంతుల జాబితాలో దమానీ సంపద విలువ రూ.14.5 బిలియన్ డాలర్లు (లక్షా 6,401 కోట్ల రూపాయలు)గా ఉన్నది. డీమార్ట్ ఏకీకృత నికర ఆదాయం గతేడాది అక్టోబర్-డిసెంబర్లో 11.3 శాతం ఎగబాకి రూ.7,587.32 కోట్లుగా నమోదైంది. లాభం 16.3 శాతం ఎగిసి రూ.446.95 కోట్లుగా ఉన్నది.
ఇవి కూడా చదవండి :
నూతన ఆవిష్కరణల కోసం జీఎమ్మార్ ఇన్నోవెక్స్