కరీంనగర్ : రాష్ట్రంలో ఎవరూ అర్థాకలితో ఇబ్బంది పడొద్దన్న సీఎం కేసీఆర్ ఆదేశానుసారం ప్రైవేటు పాఠశాలల బోధన, బోధనేతర సిబ్బందికి ప్రభుత్వం అందించే 25 కిలోల బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి గంగుల కమలాకర్ బుధవారం కరీంనగర్లో లాంఛనంగా ప్రారంభించారు. యూడీఐఎస్ఈలో నమోదైన 1,13,850 మందికి రూ. 2 వేల నగదుతో పాటు 13,715 రేషన్ షాపుల ద్వారా 3 వేల మెట్రిక్ టన్నుల బీపీటీ బియ్యం పంపిణిని ప్రభుత్వం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ..
కరోనా సంక్షోభంతో ప్రపంచం, భారతదేశంలోని మిగతా అన్ని రాష్ట్రాలు ప్రజలు, ఉద్యోగులని వారి మానాన వారిని వదిలేసి చేతులెత్తేస్తే కేవలం తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ ప్రోద్బలంతో సంక్షేమాన్ని కొనసాగించడమే కాక మానవతా ద్రుక్పథంతో మరింత సాయం చేస్తుందన్నారు. ప్రైవేట్ టీచర్లు, స్కూళ్ల సిబ్బందికి పాఠశాలలు పునఃప్రారంబించే వరకూ సాయాన్ని కొనసాగించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉన్నా, ఏ హైకోర్టు, ఇతర సంఘాలు డిమాండ్ చేయకున్నా మానవతా థృక్పదంతో అందరిని ఆదుకుంటున్నట్లు పేర్కొన్నారు.
డాటా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ చివరి వ్యక్తి వరకూ సాయం అందేలా సీఎం ఆదేశాల్ని పాటిస్తామని మంత్రి చెప్పారు. ప్రతీ ప్రైవేట్ టీచర్, సిబ్బంది ఆత్మగౌరవంతో బ్రతికేలా స్కూళ్లు ప్రారంభమయ్యేవరకూ ఈ సాయం కొనసాగుతుందని తెలిపారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకూ 3027 మంది ఉద్యోగుల్ని గుర్తించి రూ. 2 వేల సాయం అందజేతతో పాటు 441 రేషన్ షాపుల ద్వారా 76 మెట్రిక్ టన్నుల బీపీటీ బియ్యం అందిస్తున్నామన్నారు.