న్యూఢిల్లీ: ఎంబీబీఎస్ ఇంటెర్న్లకు వారం రోజుల పాటు ఆయుష్ మందులపై తప్పనిసరి శిక్షణ నిబంధనను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీనిని మిక్సోపతిగా అభివర్ణిస్తూ.. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ)కు లేఖ రాసింది. ఈ వారం రోజుల తప్పనిసరి శిక్షణ ఇప్పుడున్న నిబంధనలకు పూర్తి విరుద్ధం. దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. వృత్తి స్వచ్ఛత కోసం ఐఎంఏ కట్టుబడి ఉంది అని తన లేఖలో ఐఎంఏ స్పష్టం చేసింది.
ఆయుష్, దాని విభాగాలు చాలా పెద్ద సబ్జెక్ట్లు. అక్కడ వారం రోజులు పని చేయడం వల్ల ఇంటెర్న్ కొత్తగా నేర్చుకునే నైపుణ్యం ఏముంటుంది. వాళ్లకు వాళ్ల మెంటార్ ఎవరో స్పష్టత కూడా ఉండదు. వాళ్లను ఓ పరిపూర్ణ మనిషిగా చేయడానికి ఇంజినీరింగ్, అగ్రికల్చరల్ సైన్స్ సబ్జెక్టులను కూడా చేరుస్తారా అంటూ ఐఎంఏ ప్రశ్నించింది. దీనికి బదులు ఒకటి లేదా రెండు వారాల పాటు బయోఎథిక్స్, ఫ్యామిలీ మెడిసిన్లలో వారిని పోస్టింగ్ చేయాలని సూచించింది.
ఫ్యామిలీ మెడిసిన్ ఇప్పుడు చాలా అవసరం అని ఐఎంఏ అభిప్రాయపడింది. గ్రాడ్యుయేషన్ స్థాయిలో నేర్చుకోని, ప్రాక్టీస్ చేయని మెడిసిన్పై ఇంటెర్న్కు శిక్షణ అనేది మంచి నిర్ణయం కాదని స్పష్టం చేసింది. ఎన్ఎంసీ ఈ మధ్యే ఎంబీబీఎస్ ఇంటెర్న్ ఆయుష్ మెడిసిన్లో వారం పాటు శిక్షణ పొందాలన్న నిబంధన తప్పనిసరి చేసింది.