న్యూఢిల్లీ: కరోనా ఫస్ట్ వేవ్తో పోల్చితే భారత ఆర్థిక వ్యవస్థపై సెకండ్ వేవ్ ప్రభావం తక్కువగానే ఉన్నదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. అయితే అనిశ్చిత పరిస్థితులు స్వల్పకాలిక నిరోధంగా పనిచేసే అవకాశం ఉందని పేర్కొన్నది. పునరుత్తేజానికి ప్రైవేట్ డిమాండ్ చాలా ముఖ్యమైనదని వివరించింది. కొవిడ్-19 రెండో ప్రభంజనం విజృంభణను ఎంత వేగంగా మన దేశం అడ్డుకోగలదనేదానిపైనే దేశ వృద్ధి అవకాశాలు ఆధారపడినట్లు తెలిపింది. గురువారం విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ అంశాలను వివరించింది.
కరోనా మహమ్మారి తర్వాత స్వయం సమృద్ధ జీడీపీ వృద్ధి పథం కోసం ప్రైవేటు వినియోగం, పెట్టుబడుల డిమాండ్ చెప్పుకోదగిన స్థాయిలో పునరుద్ధరణ జరుగాలని ఆర్బీఐ నివేదిక పేర్కొన్నది. ప్రైవేటు వినియోగం, పెట్టుబడుల డిమాండ్ వాటా జీడీపీలో దాదాపు 85 శాతం వరకు ఉంటుందని తెలిపింది. సాధారణంగా పెట్టుబడుల కంటే వినియోగం ద్వారానే సంక్షోభానంతరం కోలుకోవడం ఎక్కువగా జరుగుతుందని, అయితే పెట్టుబడుల ద్వారా కోలుకోవడంవల్ల మరింత గట్టిగా నిలదొక్కుకోవడం సాధ్యమవుతుందని వివరించింది.
ఆర్థిక సంవత్సరం 2021లో ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ 6.99 శాతం పెరిగి, రూ.57.08 ట్రిలియన్లకు పెరిగినట్లు ఈ నివేదిక వెల్లడించింది. ఆదాయం 10.96 శాతం తగ్గిందని, అదే సమయంలో ఖర్చు కూడా 63.10 శాతం తగ్గిందని తెలిపింది. విదేశీ మారక ద్రవ్య లావాదేవీల నుంచి నెట్ గెయిన్స్ గత ఆర్థిక సంవత్సరంలో రూ.29.993 బిలియన్లు అని, ఈ ఆర్థిక సంవత్సరంలో 506.29 బిలియన్లు అని వివరించింది. గత వారం ప్రభుత్వానికి అందజేసిన మిగులు నిధుల్లో అధిక వాటా దీని నుంచే వచ్చినట్లు తెలిపింది.