న్యూఢిల్లీ: కొన్నాళ్లుగా వాస్తవాధీన రేఖ వెంబడి చైనీస్ ఆర్మీ దూకుడు ఎక్కువైంది. లఢాఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకూ హద్దు మీరుతున్నారు. దీంతో తాజాగా అత్యంత సున్నితమైన అరుణాచల్ ప్రదేశ్ సెక్టార్లో ఇండియన్ ఆర్మీ తమ అత్యాధునిక టెక్నాలజీ హెరాన్ డ్రోన్లతో చైనీస్ కార్యకలాపాలపై నిఘా ఉంచింది. అక్కడి ఏవియేషన్ బేస్ ఏఎల్హెచ్ ధృవ్ వంటి ఆధునిక ఆయుధ వ్యవస్థను కూడా సమకూర్చుకున్నట్లు ఏఎన్ఐ రిపోర్ట్ వెల్లడించింది. ఇజ్రాయెల్లో తయారైన అత్యాధునిక హెరాన్ డ్రోన్లు నిఘా విషయంలో తమకు ఎంతగానో ఉపయోగపడుతున్నట్లు మేజర్ కార్తీక్ గార్గ్ చెప్పారు.
నిఘా వనరుల విషయానికి వస్తే ఇది అద్భుతమైన ఎయిర్క్రాఫ్ట్. దీనిని తొలిసారి వాడినప్పటి నుంచీ ఇప్పటి వరకూ నిఘా వ్యవస్థకు వెన్నెముకలాగా నిలుస్తోంది. 30 వేల అడుగుల ఎత్తు వరకూ కూడా ఎగురుతూ.. నేల మీద ఉన్న కమాండర్లకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తుంది. దానిని బట్టి తీసుకోవాల్సిన చర్యలపై మేము దృష్టి సారిస్తాం. 24 నుంచి 30 గంటలపాటు ఏకధాటిగా ఇది ఎగరగలదు అని మేజర్ కార్తీక్ తెలిపారు. ప్రస్తుతం అరుణాచల్ వంటి సున్నితమైన సెక్టార్లలో ఇటు ఇండియా, అటు చైనా 50 వేల నుంచి 60 వేల మంది బలగాలను మోహరించాయి.