నూతన భవనం కోసం రూ.54లక్షలు మంజూరు
వచ్చే విద్యాసంవత్సరానికి భవనం పూర్తి
ఎమ్మెల్యే మర్రికి కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు
తిమ్మాజిపేట, ఏప్రిల్ 9: మండలంలోని మరికల్ ప్రాథమికోన్నత పాఠశాలకు మహర్దశ పట్టనున్నది. పాఠశాలలో అదనపు తరగతిగదుల నిర్మాణానికి ప్రత్యేక నిధుల కింద రూ.54లక్షలు మంజూరయ్యాయి. కొన్ని దశాబ్దాల కిందట నిర్మించిన పాఠశాల భవనంలోని గదులు శిథిలావస్థకు చేరడంతో ముందు జాగ్రత్తగా రెండు గదులను మూసివేశారు. పాఠశాల అప్గ్రేడ్ కావడంతో గదుల సమస్య నెలకొన్నది. దీంతో గతంలో పనిచేసిన ఉపాధ్యాయులు సొంత నిధులు, దాతల సహాయంతో రేకుల షెడ్లు నిర్మించారు. అయినా సమస్య తీరలేదు. హరితహారం కార్యక్రమంలో భాగంగా గత సంవత్సరం గ్రామానికి ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి వచ్చారు. ఆ సమయంలో స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేకు పరిస్థితిని వివరించారు. స్వయంగా గదులను పరిశీలించిన ఎమ్మెల్యే తప్పనిసరిగా అదనపు గదులు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈమేరకు నాలుగైదు నెలల్లోనే పాఠశాలలో అదనపు గదుల కోసం తన ప్రత్యేక నిధుల నుంచి రూ.54 లక్షలు మంజూరు చేయించారు. దీంతోపాటు అసంపూర్తిగా ఉన్న మరో గదిని వెంటనే పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి గదుల సమస్య తీరనున్నది. నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు, ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు.