న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్లో అక్కడి ఆర్మీని జయించి వాళ్ల దగ్గర ఉన్న అమెరికా ఆయుధాలను సొంతం చేసుకున్నారు తాలిబన్లు( Taliban ). వీటి వల్ల ఇండియాకు ముప్పే అంటున్నారు ఆర్మీలోని సీనియర్ అధికారులు. ఆ ఆయుధాలతో మొదట పాకిస్థాన్లో భయానక వాతావరణం సృష్టించే తాలిబన్లు.. తర్వాత ఇండియాలోకి వాటిని అక్రమంగా తీసుకువచ్చే ప్రమాదం ఉన్నదని ఆ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్థాన్ ఆర్మీతోపాటు అది మద్దతిచ్చే ఉగ్రవాద సంస్థలకు ప్రస్తుతం భారీ స్థాయిలో ఈ అమెరికా ఆయుధాలు అందుతున్నాయి.
ఐఎస్ఐ మద్దతిస్తున్న ఉగ్రవాద గ్రూపులు తాలిబన్ల విజయం తర్వాత బలపడ్డాయి. తాలిబన్ల చేతుల్లోని అమెరికా ఆయుధాలతో ఈ ఉగ్రవాద సంస్థలు మొదట పాకిస్థాన్లోనే హింసకు తెరలేపవచ్చు. ఆ తర్వాత అవి ఇండియాకు చేరుతాయి అని సీనియర్ ఆర్మీ అధికారులు అభిప్రాయపడినట్లు ఇండియా టుడే వెబ్సైట్ వెల్లడించింది.
తాలిబన్ల చేతుల్లోని ఆయుధాలు ఇవీ..
ప్రస్తుతం తాలిబన్ల దగ్గర అమెరికాకు సంబంధించిన అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి. అందులో ఐదు లక్షల వరకూ ఎం-16, ఎం-14 అసాల్ట్ రైఫిల్స్, అమెరికన్ లైట్ మెషీన్ గన్స్, 50 కాలిబర్ ఆయుధాలు, సాయుధ వాహనాలు వంటివి ఉన్నాయి. వీటికితోడు స్నైపర్ రైఫిల్స్, బుల్లెట్ప్రూఫ్ జాకెట్లు కూడా తాలిబన్ల చేతుల్లో పడ్డాయి. ఈ చిన్న ఆయుధాలతోపాటు 2 వేల వరకూ సాయుధ వాహనాలు, హమ్వీలు,యూహెచ్-60 బ్లాక్ హాక్స్ సహా 40 ఎయిర్క్రాఫ్ట్లు, అటాక్ హెలికాప్టర్లు, స్కాన్ఈగిల్ స్మాల్ డ్రోన్లు కూడా తాలిబన్ల చేతుల్లో పడినట్లు వార్తలు వస్తున్నాయి.
పెద్ద ఆయుధాలను వాడటం అంత సులువు కాకపోయినా.. చిన్న ఆయుధాలను మాత్రం ఆఫ్ఘనిస్థాన్ వెలుపల కూడా సులువుగా వినియోగించే ప్రమాదం ఉంది. ఈ ఆయుధాలు కశ్మీర్ లోయలో విధ్వంసం సృష్టించే ప్రమాదం ఉండటంతో అక్కడి భద్రతా బలగాలు పూర్తి అప్రమత్తంగా ఉన్నట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.