న్యూఢిల్లీ: సగటున ప్రతి రోజూ 34,30,502 కరోనా వ్యాక్సిన్లను ఇవ్వడం ద్వారా ప్రపంచంలో ఇండియానే టాప్లో ఉన్నదని కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించింది. ఇప్పటి వరకూ 9.01 కోట్ల వ్యాక్సిన్లు ఇచ్చినట్లు తెలిపింది. ఇందులో 89 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలు, 97 లక్షల మంది ఫ్రంట్లైన్ వర్కర్లు తొలి డోసు తీసుకోగా.. 60 ఏళ్లు దాటిన వాళ్లలో 3.63 కోట్ల మంది, 45 నుంచి 60 ఏళ్ల మధ్యలో 2.36 కోట్ల మంది తొలి డోసు తీసుకున్నట్లు ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
ప్రపంచవ్యాప్తంగా రోజువారీ ఇస్తున్న వ్యాక్సిన్ల సంఖ్యను తీసుకుంటే సగటున 34.3 లక్షల వ్యాక్సిన్లతో ఇండియానే తొలి స్థానంలో ఉన్నదని కూడా తెలిపింది. దేశంలోని మొత్తం వ్యాక్సిన్లలో 8 రాష్ట్రాలు (మహారాష్ట, రాజస్థాన్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, మధ్య ప్రదేశ్, కేరళ)లలోనే 60 శాతం ఇచ్చినట్లు చెప్పింది. గత 24 గంటల వ్యవధిలో 30 లక్షల మంది వ్యాక్సిన్ ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాక వెల్లడించింది. జనవరి 16న ప్రారంభమైన ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఏప్రిల్ 7వ తేదీతో 82వ రోజుకు చేరింది.