న్యూఢిల్లీ: ఇండియాలోనే తొలి, ఏకైక పాజిటివ్ న్యూస్ చానెల్ అంటూ ఇండియా టుడే గ్రూప్ గుడ్న్యూస్ టుడే (Good News Today) పేరుతో ఓ చానెల్ను లాంచ్ చేసింది. న్యూస్ అంటే షాక్కు గురి చేసేది, సంచలనం కలిగించేదే కాదు పాజిటివ్ న్యూస్ కూడా అంటూ ఆ గ్రూప్ ఈ చానెల్ లాంచ్ చేయడం విశేషం. అచ్చీ ఖబర్, సచ్చీ ఖబర్ (మంచి వార్త, నిజమైన వార్త) ట్యాగ్లైన్తో ఈ గుడ్ న్యూస్ టుడే లాంచ్ అయింది. ప్రతికూల వార్తల్లోనూ ఎన్నో నిర్మాణాత్మక కథనాలు ఉంటాయని, కానీ వాటిని ఎవరూ పట్టించుకోరని ఈ సందర్భంగా ఇండియన్ టుడే గ్రూప్ చెప్పింది.
పరిష్కారాలపైనే తమ న్యూస్ చానెల్ దృష్టి పెడుతుందని స్పష్టం చేసింది. గ్లాస్ సగం నిండుగా ఉన్నదన్న కాన్సెప్ట్ తమదని తెలిపింది. బతుకుపై ఓ నమ్మకాన్ని, మానవ విజయాలను, ఆవిష్కరణలను ప్రజల ముందుకు తీసుకొస్తామని చెప్పింది. ముఖ్యంగా కరోనా మహమ్మారి నుంచి బయటపడుతున్న సమయంలో ఓ సానుకూల దృక్పథం అన్నది అవలంబించుకోవాల్సిన అవసరం ఉన్నదని ఇండియా టుడే గ్రూప్ వైస్ చైర్పర్సన్ కాలీ పూరీ అన్నారు. రోజువారీ వార్తలను అందించడం ఆపకున్నా.. వాటి చుట్టూ ఉన్న దృక్పథాన్ని ఈ చానెల్ ద్వారా మార్చే ప్రయత్నం చేయనున్నట్లు తెలిపారు.