జీడిమెట్ల, మార్చి 30 : బ్యాంకులు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు ఇలా ఎవరి సహాయం లేకుండానే ఆర్థిక స్వావలంబన వైపు వేసేందుకు మహిళలు ముందుకు రావడం అభినందనీయమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. గాజులరామారం డివిజన్ పరిధి లెనిన్నగర్లో 60 మంది సభ్యులతో కలిసి నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ దుర్గమ్మ, పోచమ్మ మహిళ పరపతి పొదుపు సంఘాన్ని మంగళవారం ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్తో కలిసి స్థానిక కార్పొరేటర్ రావుల శేషగిరి రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పొదుపు చేసుకునే డబ్బుతో మహిళలు కుటుంబ అవసరాలను తీర్చడమే కాకుండా ఆర్థికంగా తమ కాళ్లపై నిలబడవచ్చన్నారు.
బ్యాంకులు, ప్రభుత్వం ఇచ్చే రుణాలను తీసుకుని వాటిని క్రమంతప్పకుండా చెల్లించడం ద్వారా మరిన్ని రుణాలు పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో చింతల్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మహమ్మద్ రఫీ, మహిళలు శ్రీ దుర్గమ్మ, పోచమ్మ మహిళ పరపతి పొదుపు సంఘం అధ్యక్షురాలు డి.దుర్గ, ఉపాధ్యక్షురాలు పి.సుజాత, సుకన్య, ప్రధాన కార్యదర్శి ఎస్.పద్మ, సంయుక్త కార్యదర్శులు జి.వినోద, నాగమణి, కోశాధికారి కె.భాగ్యమ్మ, క్యాషియర్లు పి.రత్న, పి.కల్పన, మహిళా సంఘం అధ్యక్షురాలు సంధ్యారెడ్డి, దివ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.