హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో సోమవారం కాల్పులు జరిగాయి. ఓల్డ్ సిటీలోని కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకున్నది. స్థిరాస్తి వ్యాపారిగా ఉన్న హబీబ్ హష్మీ ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిలాల్ నగర్లో హబీబ్ హష్మీ తన భార్యా ఇద్దరు పిల్లలపై కాల్పులకు తెగబడ్డాడు.
లైసెన్స్డ్ రివాల్వర్తో హష్మీ జరిపిన కాల్పుల నుంచి వారు త్రుటిలో తప్పించుకున్నారు. హష్మీ మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. బుల్లెట్లు గోడకు తగలడంతో వారికి ప్రమాదం తప్పింది. ఈ సమాచారం కాలాపత్తర్ పరిధిలో సంచలనం కలిగించింది. వార్త తెలియగానే అప్రమత్తమైన కాలాపత్తర్ పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన పూర్వాపరాలు తెలియాల్సి ఉంది.