న్యూఢిల్లీ: అత్యంత వేగంగా పరిగెత్తే చిరుత పులులు ఒకప్పుడు ఇండియాలో ఎక్కువ సంఖ్యలో ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య అంతరించిపోయింది. అయితే మళ్లీ ఆ వన్య ప్రాణుల సంఖ్యను పెంచే ప్రయత్నం జరుగుతున్నది. దక్షిణాప్రికా నుంచి కొత్తగా ఎనిమిది చిరుతలను తీసుకురానున్నారు. వైల్డ్లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డీన్ యద్వేంద్రదేవ్ జాలా ఈ విషయాన్ని తెలిపారు. అన్నీ అనుకూలిస్తే ఈ ఏడాది నవంబర్లో 8 చిరుత పులులు దక్షిణాఫ్రికా నుంచి ఇండియాకు వస్తాయన్నారు. వాటిల్లో అయిదు మగ, మూడు ఆడ చిరుతలుంటాయన్నారు. శరీరంపై నల్లటి మచ్చలు ఉండే చీతాలు.. అత్యంత వేగంగా పరుగెత్తుతాయి. అవి గంటకు 70 మైళ్ల వేగంతో వెళ్లగలవు. ప్రస్తుతం సౌతాఫ్రికా, నమీబియా, బోట్సవానాలో మొత్తం ఏడు వేల చీతాలు ఉన్నాయి. అంతరించిపోతున్నఆ చీతాలకు ఇప్పుడు మధ్యప్రదేశ్, రాజస్థాన్లో ఉన్న అడవులు కేంద్రాలుగా మారనున్నాయి. ఎంపీలోని కూనో నేషనల్ పార్క్, రాజస్థాన్లోని ముకుంద్ర హిల్స్లో 8 చీతాలను పెంచనున్నారు.