సొంత మండలం కమలాపూర్ నుంచే వ్యతిరేకత
నీచ రాజకీయాలు చేస్తున్నాడని టీఆర్ఎస్ నేతల ధ్వజం
బర్తరఫ్తో తమకు నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని వెల్లడి
దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్
పార్టీ వెంటే ఉంటామని స్పష్టం
మంత్రి గంగుల కమలాకర్తో వరుస భేటీలు
కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటాం : మంత్రి గంగుల
కార్పొరేషన్/హుజూరాబాద్/వీణవంక, మే 16:మాజీ మంత్రి ఈటల రాజేందర్కు అసంతృప్తి సెగ తగులుతున్నది. హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు, కార్యకర్తల నుంచి ఆయనకు రోజురోజుకూ ఆదరణ తగ్గిపోతున్నది. తాజాగా, ఆయన సొంత మండలం కమలాపూర్ నుంచే వ్యతిరేకత వ్యక్తమైంది. ఈటల నీచ రాజకీయాలు చేస్తున్నారని అక్కడి టీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. మంత్రి పదవి నుంచి ఆయన్ను బర్తరఫ్ చేయడంతో తమకు నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని స్పష్టం చేశారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో నిలువాలని సవాల్ విసిరారు. ఈ మేరకు మంత్రి గంగుల కమలాకర్తో ఆదివారం ఉదయం సమావేశమయ్యారు. మరో వైపు హుజూరాబాద్, వీణవంకలో విలేకరుల సమావేశాలు నిర్వహించి ఈటల తీరుపై ధ్వజమెత్తారు. కాగా, హుజూరాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులతో వరుసగా భేటీ అవుతున్న మంత్రి గంగుల,కార్యకర్తలకు పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా కల్పిస్తున్నారు.
మాజీ మంత్రి ఈటల రాజేందర్పై హుజూరాబాద్ నియోజకవర్గంలో రోజురోజుకూ అసంతృప్తి పెరుగుతోంది. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకుల నుంచి ఆదరణ తగ్గుతోంది. తాజాగా, ఆయన సొంతమండలమైన కమలాపూర్ నుంచే వ్యతిరేకత వచ్చింది. ఈటల తన స్వార్థ ప్రయోజనాల కోసం తమను వినియోగించుకున్నారని అక్కడి నేతలు మండిపడ్డారు. ఈ మేరకు కరీంనగర్లో మంత్రి గంగులతో సమావేశమైన నేతలు హుజూరాబాద్లో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. వీణవంకలోనూ పార్టీ ప్రజాప్రతినిధులు ప్రెస్మీట్ నిర్వహించి, తామంతా టీఆర్ఎస్ వెంటే ఉంటామని స్పష్టం చేశారు.
రాష్ట్ర మంత్రి వర్గం నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్ను బర్తరఫ్ చేయడంతో తమకు నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని మంత్రి ఈటల సొంత మండలమైన కమలాపూర్ పరిధిలోని శనిగరం, మర్రిపల్లిగూడెం గ్రామాల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. ఈ మేరకు వారు ఆదివారం ఉదయం కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ను కలువగా, మంత్రి వారితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మంత్రితో మాట్లాడుతూ ఉద్యమకారులను పక్కనపెట్టి సొంత వారికి పెద్దపీట వేశారని విమర్శించారు. ద్వితీయ శ్రేణి నాయకులను ఏ రోజు కూడా ప్రోత్సహించలేదని, డివైడ్ అండ్ రూల్ పాలసీతో అణచివేశారని దుయ్యబట్టారు. పార్టీని అడ్డుపెట్టుకొని ఆర్థికంగా బలోపేతం అయ్యారని ఆరోపించారు. ఆయన సొంత మండలంలోనూ ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని పేర్కొన్నారు. కేవలం తన స్వార్థంతో అధికారాన్ని దుర్వినియోగం చేశారని, అక్రమాస్తులను సంపాదించారని విమర్శించారు. పార్టీకి చెందిన ఏ కార్యకర్త కూడా మాజీ మంత్రి వెంట లేరని చెప్పారు. హుజూరాబాద్ నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి తన వారి కోసం మాత్రమే పని చేశారని విమర్శించారు. పార్టీ వల్లే ఎవరికైనా పేరు వచ్చిందని, పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తామంతా కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని అనేక సమస్యలు ప్రభుత్వం దృష్టికి రాకుండా ప్రయత్నించి కార్యకర్తల్ని అణచివేశారని మండిపడ్డారు. తామంతా సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తామని తెలిపారు. శనిగరం, మరిపల్లిగూడెం గ్రామాల్లో నెలకున్న సమస్యల్ని ఈ సందర్భంగా మంత్రి గంగులకు వివరించారు.
కార్యకర్తలకు ఎల్లవేళలా అండ :మంత్రి గంగుల
టీఆర్ఎస్ కోసం పని చేసే కార్యకర్తలకు పార్టీ అన్ని సమయాల్లోనూ అండగానే నిలుస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న వారితో మాట్లాడుతూ హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అన్ని వేళల్లో తాము అందుబాటులో ఉంటామన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాల్లో నెలకొన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎవరూ అధైర్యపడవద్దని, కార్యకర్తలకు అందుబాటులో ఉంటామన్నారు. పార్టీ హైకమాండ్ నిరంతరం తమతోనే ఉంటుందని పేర్కొన్నారు. మంత్రితో సమావేశమైన వారిలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పింగిళి ప్రదీప్రెడ్డి, శనిగరం సర్పంచ్ పింగళి రవళి రంజిత్రెడ్డి, ఉప సర్పంచ్ మేకల తిరుపతి, స్థానిక నాయకులు చెరిపల్లి రాంచందర్, కొలిపాక సాంబయ్య, రతన్, ఎం భిక్షపతి, సంగెం కవిత కరుణాకర్, కొత్తపల్లి శ్రీదేవి రాజు, బండి కుమారస్వామి, కోల రమేశ్, కుక్కల యుగేందర్, బండి జ్యోతి భద్రయ్య, సుప్రియ, మంజుల భూమయ్య, శివాజీ, శ్రీకాంత్, పవన్, చంద్రశేఖర్, తదితరులు ఉన్నారు.
మంత్రిని కలిసిన జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు
రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ను హుజూరాబాద్ జడ్పీటీసీ సభ్యుడు బక్కారెడ్డి, జమ్మికుంట ఎంపీపీ దొడ్డె మమత, ఎంపీటీసీలు రాచపల్లి రాజయ్య, పోల్సాని రాజేశ్వర్రావు, సంపెల్లి స్వరూప భీమ్రావు, తదితరులు ఆదివారం ఉదయం ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను పట్టించుకోకుండా ఈటల తన స్వార్థం కోసం పని చేశారని ఆరోపించారు. పార్టీ ఆదేశాల మేరకు మంత్రి గంగుల కమలాకర్కు విధేయతగా పని చేస్తుంటే ఆయనను విమర్శించడం సరికాదన్నారు. మాజీ మంత్రి పార్టీపై, ప్రభుత్వ పథకాలపై విమర్శలు చేస్తూ తమ ప్రాబల్యం పెంచుకోవడానికి యత్నించారని విమర్శించారు. ఇక్కడ కరీంనగర్ మేయర్ వై సునీల్రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.
పార్టీ వెంటే ఉంటాం : ఎంపీపీలు
టీఆర్ఎస్ పార్టీ వెంటే ఉంటామని హుజూరాబాద్, వీణవంక ఎంపీపీలు రాణి సురేందర్రెడ్డి, రేణుక తిరుపతిరెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు వారు ఆదివారం కరీంనగర్లోని మంత్రి గంగుల కమలాకర్ నివాసంలో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉందని, ఎవరు కూడా పార్టీని వీడి పోయేందుకు సిద్ధంగా లేరన్నారు. వీరితో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్రావు ఉన్నారు.