తలాపునే మంజీరా నది పారుతున్నా తడారిన నేలలు. ఓవైపు భూగర్భ జలాల కొరత.. మరోవైపు సాగునీటి వనరుల లేమి, వెరసి వర్షాధార పంటలతోనే వ్యవసాయాన్ని నెట్టుకు రావాల్సిన దైన్యం. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలు తరతరాలుగా ఎదుర్కొంటున్న నీటిగోస ఇది. సాగునీటి కల్పన వైపు దృష్టిసారించి ఇక్కడి రైతుల తలరాత మార్చే ప్రయత్నం సమైక్య రాష్ట్రంలో ఏ ప్రభుత్వమూ చేయలేదు. దీంతో మంజీర పరవళ్లను చూస్తూ పరవశించడం తప్ప తమ పొలాలకు నీళ్లు మళ్లించుకోలేని నిస్సహాయ స్థితి ఇక్కడి రైతులది. ఇదంతా గతం. కాలం మారింది. సీఎం కేసీఆర్ కృషితో ఇప్పుడు వీరికి మంచిరోజులు రాబోతున్నాయి. నారాయణఖేడ్,అందోల్ నియోజకవర్గాలను సస్యశ్యామలం చేసే బసవేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పనులు నేడు ప్రారంభం కానున్నాయి. ఈ ఎత్తిపోతలతో 1.65లక్షల ఎకరాలకు సాగునీరంది రానున్న రోజుల్లో ఈ ప్రాంతం సుభిక్షంగా మారనుంది. అన్నదాతకు నీటిగోస శాశ్వతంగా తీరనుంది. ఈ ప్రాంత సాగులో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోనున్నాయి.
సంగారెడ్డి ,జూన్ 20 (నమస్తే తెలంగాణ)/ నారాయణఖేడ్
నారాయణఖేడ్, జూన్ 20 : తలాపునే మంజీరా పారుతున్నా తడారిన నేలలు. ఓవైపు భూగర్భ జలాల కొరత.. మరోవైపు సాగునీటి వనరుల లేమి, వెరసి వర్షాధార పంటలతోనే వ్యవసాయాన్ని నెట్టుకురావాల్సిన దైన్యం. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలు తరతరాలుగా ఎదుర్కొంటున్న నీటిగోస ఇది. సమైక్య రాష్ట్రంలో ఏ ప్రభుత్వమూ నారాయణఖేడ్ నియోజకవర్గంలో సాగునీటి కల్పన వైపు దృష్టిసారించి ఇక్కడి రైతుల తరరాత మార్చే ప్రయత్నం చేయలేదు. నాగల్గిద్ద మండలంలోని గౌడ్గావ్ జనవాడ నుంచి మనూరు మండలంలోని రాయిపల్లి వరకు 46 కిలోమీటర్ల మేర మంజీరా నది కండ్ల నిండా ప్రవహిస్తున్నా, గంగమ్మ పరవళ్లను చూస్తూ పరవశించడం తప్ప తమ పొలాలకు మళ్లించుకోలేని నిస్సహాయ స్థితి రైతులది. ఇదంతా గతం. కాలం మారింది తెలంగాణ స్వరాష్ట్రంగా ఆవిర్భవించింది. బీడు భూములను సస్యశ్యామలం చేసే సంకల్పం, రైతుల బాధలు తెలిసిన నాయకుడు పాలకుడు కావడంతో నారాయణఖేడ్ నియోజకవర్గానికి వరంలా పరిణమించింది. సాగునీటి అదృష్టానికి నోచుకోని నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయాలనే దిశగా జరిగిన అనేక ప్రయత్నాలకు కార్యరూపమే బసవేశ్వర ఎత్తిపోతల పథకం. సీఎం కేసీఆర్ సంకల్పం, మంత్రి హరీశ్రావు సహకారం ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి చొరవ ఫలితంగా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని 1.31 లక్షల ఎకరాలకు, అందోల్ నియోజకవర్గంలోని 34 వేల ఎకరాలకు సాగునీరందే అవకాశం ఉంది. తరతరాలుగా తడారిన నేలకు జలసిరిని తరలించే శుభ తరుణం కార్యరూపం దాల్చేందుకుగా అడుగులు పడుతున్నాయి. మనూరు మండలం బోరంచ శివారులో సోమవారం మంత్రి హరీశ్రావు చేతుల మీదుగా బసవేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పనులను ప్రారంభించనున్నారు. దీంతో సాగునీటి కల్పనలో ఓ ముందడుగు పడనుంది.
నారాయణఖేడ్ నియోజకవర్గానికి వరప్రదాయిని…
నారాయణఖేడ్ డివిజన్లో మొత్తం 1,90,760 ఎకరాల సాగుభూమి ఉండగా, మధ్యతరహా సాగు నీటి ప్రాజెక్టు నల్లవాగు సహా ఇతర చిన్నతరహా జలాశయాలలైన చెరువులు, కుంటల ద్వారా దాదాపు 20 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరందుతున్నది. బసవేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా ఏకంగా 1.31 లక్షల ఎకరాలు సాగునీటితో పునీతం కాను న్నది. ఇందుకోసం 135 కిలో మీటర్ల మేర మొత్తం ఆరు కెనాల్లను నిర్మించే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. కరస్గుత్తి కెనాల్ 42.5 కిలోమీటర్లు, కంగ్టి కెనాల్ 19 కిలోమీటర్లు, అంతర్గాం కెనాల్ 14 కిలోమీటర్లు, నారాయణఖేడ్ కెనాల్ 24 కిలోమీటర్లు, కాగా, అందోల్ నియోజకవర్గంలోని 34 వేల ఎకరాలకు నీరందించేందుకు 20 కిలోమీటర్ల మేర రేగోడ్ కెనాల్ను, 14.6 కిలోమీటర్ల మేర వట్పల్లి కెనాల్ను ఏర్పాటు చేయనున్నారు. 8 టీఎంసీల అంచనా సామర్థ్యంతో రూపుదిద్దుకోనున్న ఎత్తిపోతల పథకం నియోజకవర్గంలోని అన్ని మండలాల సాగునీటి అవసరాలను తీర్చనుండడం విశేషం. నాలుగు కెనాల్ల ద్వారా నియోజకవర్గంలోని 175 చెరువులను అనుసంధానం చేసే దిశగా పథకం రూపకల్పన చేయగా, అందోల్ నియోజకవర్గంలోని రేగోడ్, వట్పల్లి మండలాల్లోని 14 చెరువులను అనుసంధానిస్తూ రెండు కెనాల్ల ద్వారా నీరందిస్తారు. మూడు లిఫ్టుల ద్వారా నీటిని ఎత్తిపోసే రీతిలో పథకాన్ని డిజైన్ చేయగా, బోరంచ సహా మొత్తం మూడు చోట్ల పంప్హౌస్లను నిర్మించనున్నారు. కరస్గుత్తి కెనాల్ కింద 88 వేల ఎకరాలు, కంగ్టి కెనాల్ ద్వారా 21,800 ఎకరాలు, అంతర్గాం కెనాల్ ద్వారా 11,200 ఎకరాలు, నారాయణఖేడ్ కెనాల్ ద్వారా 10 వేల ఎకరాలు, రేగోడ్ కెనాల్ ద్వారా 11 వేల ఎకరాలు, వట్పల్లి కెనాల్ ద్వారా 23 వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి రానున్నది.
130 గ్రామాల ఆయకట్టుకు మోక్షం..
బసవేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా మొత్తం 166 గ్రామాల ఆయకట్టుకు సాగునీరందే అవకాశం ఉంది. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని 130 గ్రామాల ఆయకట్టుకు మోక్షం లభించనుంది. నారాయణఖేడ్ మండలంలోని 34 గ్రామాలకు గాను 29,800 ఎకరాలు, మనూరు మండలంలోని 24 గ్రామాలకు గాను 21 వేల ఎకరాలకు, నాగల్గిద్ద మండలంలోని 21 గ్రామాలకు గాను 18 వేల ఎకరాలకు, సిర్గాపూర్ మండలంలోని 16 గ్రామాలకు గాను 19,035 ఎకరాలకు, కల్హేర్ మండలంలోని 10 గ్రామాలకు గాను 11,200 ఎకరాలకు, కంగ్టి మండలంలోని 25 గ్రామాలకు గాను 31,965 ఎకరాలకు నీరందే అవకాశం ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అం దోల్ నియోజకవర్గంలోని రేగోడ్ మండలంలోని 17 గ్రామాలకు 12 వేల ఎకరాలు, వట్పల్లి మండలంలోని 19 గ్రామాలకు గాను 22 వేల ఎకరాలు సాగయ్యే అవకాశముంది.
కొత్త చెరువులతో సాగునీటి కల్పన..
నారాయణఖేడ్ నియోజకవర్గంలో సాగునీటి వనరులను అభివృద్ధి చేసే ప్రయత్నంలో భాగంగా ఎనిమిది కొత్త చెరువుల నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించారు. తాజాగా నాలుగు చెరువుల నిర్మాణానికి పరిపాలన అనుమతులిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మరో నాలుగు చెరువులు మంజూరు దశలో ఉన్నా యి. నారాయణఖేడ్ మండలంలోని జగన్నాథ్పూర్, నాగల్గిద్ద మండలంలోని ఏస్గి, కేశ్వార్, ఉట్పల్లి శివార్లలో చెరువుల నిర్మాణానికి రూ.19.09 కోట్ల నిధులు ప్రభుత్వం కేటాయించింది. ఇక నాగల్గిద్ద మండలం ఇరక్పల్లి శివారులో రెండు, కంగ్టి మండలం సుక్కల్తీర్థ్, నాగల్గిద్ద మం డలం మోర్గి శివార్లలో ఒక్కో చెరువు నిర్మాణానికి చేసిన ప్రతిపాదనలు మంజూరు దశలో ఉన్నట్లు తెలుస్తున్నది. మంజూరైన నాలుగు చెరువుల నిర్మాణం పూర్తయితే ఆయా గ్రామాల్లోని ఆయకట్టుకు నీరందించే అవకాశం ఉంది.
నేడు ‘ఖేడ్’కు మంత్రి హరీశ్రావు రాక
నారాయణఖేడ్, జూన్ 20 : ఈ నెల 21వ తేదీ సోమవారం నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పర్యటించనున్నారు. ఇందులో భాగంగా మధ్యాహ్నం 12 గంటలకు మనూరు మండలం బోరంచ శివారులో నారాయణఖేడ్ నియోజకవర్గ రైతాంగానికి వరప్రదాయనిగా మారనున్న బసవేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పనులను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. అనంతరం మంత్రి మనూరు మండలం పుల్కుర్తి, మనూరు, నారాయణఖేడ్, కల్హేర్ మండలం బీబీపేట్ గ్రామాలను సందర్శించి అనారోగ్యంతో మృతిచెందిన టీఆర్ఎస్ ముఖ్య నాయకుల కుటుంబాలను కలిసి పరామర్శిస్తారు.
సీఎం కేసీఆర్ ఆశయం గొప్పది
ప్రతి ఎకరాకు సాగునీరందించే దిశగా తెలంగాణను కోటి ఎకరాల మాగాణం చేయాలనే సీఎం కేసీఆర్ ఆశయం చాలా గొప్పది. సీఎం కేసీఆర్ సంకల్పమే బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి నాంది పలికింది. ఉమ్మడి రాష్ట్రంలోని గత ప్రభుత్వాలు నారాయణఖేడ్ నియోజకవర్గంలో సాగునీటి వనరులను పెంపొందించేందుకు ఏమాత్రం ప్రయత్నం చేయలేదు. ఏ మాత్రం అభివృద్ధికి నోచుకోని వెనుకబడిన ప్రాంతంగా మార్చారు. తెలంగాణ ఏర్పడి టీఆర్ఎస్ అధికారం చేపట్టిన తర్వాత నారాయణఖేడ్ నియోజకవర్గం అభివృద్ధి దిశగా దూసుకెళ్తున్నది. నియోజకవర్గంలోని 1.31 లక్షల ఎకరాలకు సాగునీరందించాలనే లక్ష్యంతో రూపొందించిన బసవేశ్వర ఎత్తిపోతల పథకం మరోఎత్తు. సీఎం కేసీఆర్ ఆశీస్సులు, మంత్రి హరీశ్రావు సహకారంతో నియోజకవర్గ రైతుల ఆకాంక్ష సాకారం కాబోతున్నది. సీఎం కేసీఆర్కు మా ప్రాంత ప్రజలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారు.
-మహారెడ్డి భూపాల్రెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే