నిజాంసాగర్/ గాంధారి/ బీబీపేట/ మాచారెడ్డి, ఏప్రిల్ 26: జిల్లావ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో పలు గ్రామాల్లో సర్పంచులు స్వచ్ఛంద లాక్డౌన్ విధించారు. ఆయా గ్రామాల్లో స్వచ్ఛంద లాక్డౌన్ కొనసాగుతున్నది. మరికొన్ని గ్రామాల్లో లాక్డౌన్కు సోమవారం తీర్మానించారు.
గాంధారి మండలకేంద్రంలో సంపూర్ణ లాక్డౌన్ కొనసాగుతున్నది. మండలకేంద్రంలోని అన్ని దుకాణాలు, హోటళ్లను గ్రామస్తులు స్వచ్ఛందంగా మూసిఉంచారు. దీంతో మండలకేంద్రం నిర్మానుష్యంగా మారింది. మెడికల్ దుకాణాలు, దవాఖానలను మాత్రమే తెరిచి ఉంచారు. బీబీపేట మండలకేంద్రంతోపాటు మాందాపూర్ గ్రామంలో స్వచ్ఛంద లాక్డౌన్ కొనసాగుతున్నది. కిరాణా దుకాణాలను మధ్యాహ్నం 2 గంటల వరకే తెరిచి ఉంచారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామని పంచాయతీ పాలకవర్గ సభ్యులు తెలిపారు. నిజాంసాగర్, మహ్మద్నగర్ గ్రామాల్లో రెండు రోజులుగా లాక్డౌన్ కొసాగుతున్నది. ఉదయం నుంచి మధ్యా హ్నం ఒంటి గంట వరకు మాత్రమే దుకాణాలను తెరిచి ఉంచుతున్నారు.
మాచారెడ్డి మండలంలోని గజ్యానాయక్తండా, ఫరీద్పేట, ఇసాయిపేట, పాల్వంచ, మంథనిదేవునిపల్లి, ఎల్లంపేట గ్రామాల్లో స్వచ్ఛంద లాక్డౌన్ కొనసాగుతున్నది. గజ్యానాయక్తండా, ఎక్స్రోడ్ గ్రామాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే వ్యాపార, వాణిజ్య సముదాయాలు తెరుచుకున్నాయి. మిగతా గ్రామాల్లో 9 నుంచి 12 గంటల వరకు మాత్రమే దుకాణాలను తెరిచారు.
నేటి నుంచి ఆత్మకూర్, బిచ్కుందలో లాక్డౌన్
కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆత్మకూర్ గ్రామంలో మంగళవారం నుంచి లాక్డౌన్ విధిస్తున్నట్లు సర్పంచ్ బాల్రెడ్డి తెలిపారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ పాలకవర్గం సోమవారం సమావేశమై లాక్డౌన్ విధించాలని నిర్ణయించారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే దుకాణాలను తెరిచి ఉంచాలని తీర్మానించారు. నిబంధనలు ఉల్లంఘించే వారికి వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామని సర్పంచ్ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మోతె శ్రీనివాస్, గ్రామపెద్దలు పాల్గొన్నారు.
బిచ్కుంద మండలం వాజిద్నగర్లో సోమవారం ఉదయం సర్పంచ్ అనూయ, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులతో సమావేశం నిర్వహించి లాక్డౌన్కు తీర్మానించారు. ఉదయం 9 గంటల వరకే దుకాణాలను తెరిచి ఉంచాలని తీర్మానించామని తెలిపారు.బిచ్కుంద మండలకేంద్రంలో నేటి (మంగళవారం) నుంచి లాక్డౌన్ విధించాలని తీర్మానించినట్లు పంచాయతీ కార్యదర్శి రమేశ్ తెలిపారు మండల పరిషత్ కార్యాలయంలో గ్రామపెద్దలతో సోమవారం సమావేశం ఏర్పాటు చేసి లాక్డౌన్ విధించాలని తీర్మానించినట్లు చెప్పారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకే దుకాణాలను తెరిచి ఉంచాలని, దవాఖానలు, మెడికల్ దుకాణాలు ఎప్పటిలాగే కొనసాగుతాయని తీర్మానం చేశారు. బుధవారం నిర్వహించే అంగడిని పూర్తిగా రద్దుచేసినట్లు చెప్పారు. సమావేశంలో జడ్పీటీసీ భారతీ రాజు, ఎంపీపీ అశోక్ పటేల్, సొసైటీ చెర్మన్ బాలాజీ, ఎంపీవో మహబూబ్ తదితరులు పాల్గొన్నారు.
లింగంపేటలో 29 నుంచి సంపూర్ణ లాక్డౌన్..
మండల కేంద్రంలో ఐదు రోజుల పాటు సంపూర్ణ లాక్డౌన్ విధించాలని గ్రామస్తులు నిర్ణయించారు. మండలకేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం పంచాయతీ పాలకవర్గ సభ్యులు, వ్యాపారులు, గ్రామస్తులు సమావేశమయ్యారు. ఈ నెల 29 నుంచి మే 3వ తేదీ వరకు దుకాణాలను పూర్తిగా మూసిఉంచాలని నిర్ణయించారు. సమావేశంలో పంచాయతీ ఈవో రవీందర్రావు, వ్యాపారులు పాల్గొన్నారు.