ఇస్లామాబాద్: పాకిస్థాన్కు ప్రత్యేక సైనిక సామాగ్రిని అందివ్వనున్నట్లు ఇవాళ రష్యా వెల్లడించింది. దీనిపై రెండు దేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లవ్రోవ్ దీనిపై ప్రకటన చేశారు. ఉగ్రవాదంపై పోరాటం చేసేందుకు కూడా రెండు దేశాలు అంగీకరించాయి. సంయుక్త నౌక, సైనిక విన్యాసాలు కూడా చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. దాదాపు దశాబ్ధ కాలం తర్వాత రష్యాకు చెందిన విదేశాంగ మంత్రి పాక్కు వెళ్లడం ఇదే మొదటిసారి. రెండు దేశాలు నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో లవ్రోవ్ మాట్లాడారు. ఆర్థిక, వాణిజ్య, భద్రతా, ఉగ్రవాదం, రక్షణ రంగాల్లో పరస్పర సహకారం అందించుకునేందుకు అంగీకరించాయన్నారు. పాక్ విదేశాంగ మంత్రి రషా మహబూద్ ఖురేషి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.
ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పాక్ పోరాడుతోందని, ఆ పోరాటాన్ని మరింత బలోపేతం చేయాలనుకుంటున్నామని, దీని కోసం ఆ దేశానికి ప్రత్యేక సైనిక సామాగ్రిని సరఫరా చేయనున్నట్లు లవ్రోవ్ తెలిపారు. అయితే ఎటువంటి సైనిక సామాగ్రి ఉంటుందన్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. కానీ అన్ని దేశాల ప్రయోజనం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. రెండు దేశాలు సైనిక విన్యాసాలను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు అంగీకరించినట్లు ఆయన తెలిపారు. 2016 నుంచి రెండు దేశాలు డ్రుజ్బా పేరుతో సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. పాక్తో మైత్రి కొనసాగించడం పట్ల భారత్ ఆందోళన చెందవద్దు అని గతంలో రష్యా పేర్కొన్నది. ఎస్సీవో సభ్య దేశమైన పాకిస్థాన్తో సైనిక సంబంధాలు పెట్టుకున్నట్లు రష్యా చెప్పింది.
కొన్నేళ్ల క్రితం ఎంఐ-35ఎంకు చెందిన యుద్ధ, కార్గో విమానాలకు పాకిస్థాన్కు రష్యా సరఫరా చేసింది. అయితే భారత్లో రెండు రోజులు పర్యటించిన లవ్రోవ్ ఇవాళ పాక్లో విదేశాంగ మంత్రితో భేటీ అయ్యారు. ఏ దేశంతోనూ తమకు శత్రుత్వం లేదని, ప్రాంతీయ సహకారాన్ని అందిస్తామని పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావెద్ బజ్వా తెలిపారు.