న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు కొద్దిగా తగ్గాయి. శుక్రవారం 44 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవగా, తాజాగా 38 వేలకు పడిపోయాయి. నిన్నటికంటే ఇది 13 శాతం తక్కువ అని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక కరోనా వ్యాక్సినేషన్ మరో మైళురాయిని అధిగమించింది. శుక్రవారం సాయంత్రం వరకు వ్యాక్సిన్ పొందినవారి సంఖ్య 50 కోట్లు దాటింది.
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 38,628 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,18,95,385కు చేరింది. ఇందులో 4,12,153 కేసులు యాక్టివ్గా ఉండగా, 3,10,55,861 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. మరో 4,27,371 మంది మహమ్మారి వల్ల మరణించారు. ఇక శుక్రవారం ఉదయం నుంచి ఇప్పటివరకు 40,017 మంది బాధితులు కోలుకోగా, 617 మంది మృతిచెందారని ఆరోగ్యశాఖ ప్రకటించింది. కరోనా పాజిటివిటీ రేటు 2.21 శాతంగా తెలిపింది. గత 12 రోజులుగా ఇది 3 శాతం లోపే ఉంటుందని పేర్కొన్నది. కాగా, ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నది. దేశంలో మొత్తం 50,10,09,609 డోసులు పంపిణీ చేశారు. ఇందులో గత 24 గంటల్లో 49,55,138 మందికి టీకా పంపిణీ చేశామని తెలిపింది.