న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గురువారం 31,923 పాజిటివ్ కేసులు నమోదవగా, తాజాగా అవి 31 వేల 3 వందలకు తగ్గాయి. ఇందులో ఒక్క కేరళలోనే 19,682 కేసులు ఉన్నాయి.
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 31,382 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,35,94,803కి చేరాయి. ఇందులో 3,28,48,273 మంది కరోనా నుంచి బయటపడ్డారు. మరో 3,00,162 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పటివరకు 4,46,368 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక గురువారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 32,542 మంది వైరస్ నుంచి కోలుకోగా, 318 మంది మరణించారని తెలిపింది.
కాగా, కొత్తగా రికార్డయిన కరోనా కేసులు, మరణాల్లో అత్యధికంగా కేరళలోనే నమోదయ్యాయి. రాష్ట్రంలో నిన్న 19,682 కేసులు నమోదవగా, 152 మంది మృతిచెందారు. ఇక దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 72,20,642 మందికి వ్యాక్సినేషన్ చేశామని ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం 84,15,18,026 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది.