నాబార్డు’ ప్రతిష్టాత్మక అవార్డు
సౌత్జోన్ పరిధిలో ఎంపిక
అధికారులు, సిబ్బంది హర్షం
కరీంనగర్, జూలై 12 (నమస్తే తెలంగాణ) :కరీంనగర్ జిల్లా సహకార బ్యాంకు మరోసారి జాతీయస్థాయి ఖ్యాతి సొంతం చేసుకున్నది. ఉత్తమ సేవలకుగాను నాబార్డు ప్రతిష్టాత్మకంగా అందించే బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డును దక్కించుకున్నది. దేశంలో సహకార బ్యాంకులను ప్రోత్సహించేందుకు ఈ సంస్థ ఇస్తున్న అవార్డులను రెండు దశాబ్దాల క్రితం నిలిపివేసి, ఈసారి పునరుద్ధరించింది. 33 రాష్ట్ర సహకార బ్యాంకులు, 353 జిల్లా సహకార బ్యాంకులను ఐదు జోన్లుగా విడదీసి, జోన్ల వారీగా అవార్డులు ఇచ్చింది. అందులో సౌత్ జోన్ పరిధిలో రాష్ట్ర సహకార బ్యాంకు అవార్డును టెస్కాబ్, జిల్లా సహకార బ్యాంకు అవార్డును కేడీసీసీబీ అందుకుంటున్నది.
వరుస అవార్డులు దక్కించుకుంటున్న కరీంనగర్ జిల్లా సహకార బ్యాంకు ఖాతాలో మరో జాతీయస్థాయి అవార్డు చేరింది. కేడీసీసీబీ అందిస్తున్న సేవలకు గాను 2019-20 సంవత్సరానికి సంబంధించి నాబార్డు ప్రతిష్టాత్మక బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డును ప్రకటించింది. ఈ మేరకు సోమవారం నాబార్డు 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముంబైలో వెబ్నార్ ద్వారా నిర్వహించిన సదస్సులో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారులు డాక్టర్ కృష్ణమూర్తి, వీ సుబ్రమణియన్, నాబార్డు చైర్మన్ చింతల గోవింద రాజులు ఈ అవార్డులను ప్రకటించారు.
కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు వరుసగా జాతీయ స్థాయి అవార్డులు సాధిస్తున్నది. దేశంలోనే ఉత్తమ సహకార సేవలందిస్తున్న ఈ బ్యాంకుకు ఇప్పటికే నాలుగుసార్లు అవార్డులు దక్కాయి. 2015-16లో, 2016-17లో వరుసగా రెండు సార్లు జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిలిచింది. 2017-18లో జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచిన బ్యాంకు, 2019-20లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డును దక్కించుకుంది. ఈ అవార్డులను గతంలో జాతీయ సహకార బ్యాంకుల సమాఖ్య (నాఫ్స్కాబ్) ప్రకటించింది. ఈసారి మాత్రం జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) ఇచ్చింది. వీటి కోసం నాబార్డు కల్పించిన అవకాశం మేరకు వాణిజ్య, ప్రైవేట్ బ్యాంకులు కూడా పోటీ పడగా కేడీసీసీబీకి సౌత్ జోన్ స్థాయిలో జాతీయ అవార్డు రావడం జిల్లాకు గర్వకారణం. రుణాలు ఇవ్వడం, డిపాజిట్లు చేయించడం, పాలకవర్గ పనితీరును బేరీజు వేయడం, వసూళ్ల తీరును పరిశీలించడం, సిబ్బంది నాణ్యమైన సేవలను గుర్తించడం, నికర లాభాలు వంటి 16 అంశాల్లో మూడేళ్ల పాటు చూపిన ఉత్తమ సేవలను పరిశీలించిన తర్వాతనే ఈ అవార్డులు ప్రకటించారు.
అందరి కృషికి నిదర్శనం
కేడీసీసీబీ దేశంలోనే ఉత్తమ సేవలు అందిస్తున్నది. పాలకవర్గం ప్రోత్సాహం, సిబ్బంది పనితీరుకు ఇది నిదర్శనం. సహకార సంఘాలు బలోపేతమయ్యేందుకు ప్రతి సంఘ పాలకవర్గం కృషి చేస్తున్నది. ముఖ్యంగా జిల్లా సహకార వ్యవస్థలో టీమ్ వర్క్ నడుస్తున్నది. నిజాయితీ, నిబద్ధతతో పనిచేస్తున్న ఉద్యోగుల కృషి కూడా అవార్డులు రావడానికి కారణం. రుణాలు అందించడంలోనే కాకుండా రికవరీలోనూ దేశంలో ఉత్తమంగా నిలుస్తున్నది. ఈ నేపథ్యమే అవార్డులు రావడానికి దోహదపడుతున్నాయి.
ఉమ్మడి జిల్లాకు గర్వకారణం..
బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డుకు కేడీసీసీబీని ఎంపిక చేయడం ఉమ్మడి జిల్లాకు గర్వకారణం. ఇందులో సభ్యులు, డైరెక్టర్లు, బ్యాంకు అధికారులు, సిబ్బంది ఇలా ప్రతిఒక్కరి కృషి ఉన్నది. దాని ఫలితంగానే ఈ రోజు దేశంలోనే మంచి గుర్తింపు వచ్చింది. గతంలో వరుసగా జాతీయస్థాయిలో నాలుగు సార్లు అవార్డులు సాధించిన బ్యాంకు, ఈసారి ఏకంగా నాబార్డు అవార్డును కూడా దక్కించుకున్నది. దీని ద్వారా సేవలను మరింత ఉత్తమంగా అందించేలా పాలకవర్గానికి, ఉద్యోగులకు ఆత్మైస్థెర్యం పెరుగుతుంది. నాబార్డు సంస్థ రాష్ట్ర స్థాయిలో టెస్కాబ్ను, జిల్లా స్థాయిలో కేడీసీసీబీని ఎంపిక చేయడం హర్షణీయం. నాబార్డు చైర్మన్ చింతల గోవింద రాజులు, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్కు ప్రత్యేక ధన్యవాదాలు.