ఇప్పటి వరకు పది మందికి పైగా అందజేత
హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): కొవిడ్తో తీవ్రంగా బాధపడేవారికి లైఫ్ సేవింగ్ డ్రగ్గా పేరుగాంచిన టోస్లిజుమాబ్ పంపిణీ రాష్ట్రంలో ప్రారంభమైంది. ఇప్పటివరకు పదిమంది రోగులకు దీన్ని ఇచ్చినట్టు అధికారులు తెలిపారు. మొత్తం 210 ఇంజక్షన్లను కేంద్రం రాష్ర్టానికి కేటాయించింది. ఇందులో తొలి దశలో 80 ఇంజక్షన్లు రాష్ర్టానికి వచ్చాయి. రోషే కంపెనీ ఉత్పత్తి చేస్తున్న ఈ డ్రగ్ కొన్ని వారాల నుంచి దేశంలో లేకుండాపోయింది. ప్రస్తుతం కేంద్రం దీన్ని దిగుమతి చేసుకున్నది. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో చికిత్స పొందుతున్నవారికి పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో కమిటీ వేసింది. గత రెండు రోజుల నుంచి వస్తున్న దరఖాస్తులను పరిశీలించి ఈ కమిటీ ఇంజక్షన్లు పంపిణీ చేస్తున్నది.