హైదరాబాద్: పర్యావరణ రంగం, అనుబంధ విషయాల్లో విద్య, పరిశోధన, శిక్షణ, సహకార కార్యక్రమాన్ని సులభతరం చేసేందుకు జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం-హైదరాబాద్ (జేఎన్టీయూ-హెచ్), పర్యావరణ పరిరక్షణ శిక్షణ అండ్ పరిశోధన సంస్థ (ఈపీటీఆర్ఐ) మధ్య శుక్రవారం అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ అవగాహన ఒప్పందంపై జేఎన్టీయూ-హెచ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కట్టా నరసింహరెడ్డి, ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్ అధర్ సిన్హా సంతకాలు చేశారు.
ఒప్పందంలో భాగంగా వర్షపునీటి సంరక్షణ విధానం, పట్టణ నిర్వహణను అమలు చేయడంలో జేఎన్టీయూ-హెచ్, ఈపీటీఆర్ఐకి సాంకేతిక సహకారం అందిస్తుందని వర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది. పరస్పర సహకారం, నీటి సంరక్షణ కార్యకలాపాలు, సమాచార మార్పిడి, బోధనా సామగ్రి, సాంకేతిక, శాస్త్రీయ ప్రచురణలు, అధ్యాపక సభ్యులు, పరిశోధకులకు ఉపన్యాసాలు, ఇంటర్న్షిప్ మొదలైనవి ఇవ్వడానికి పరస్పర అవకాశాలు ఈ ఒప్పందం ద్వారా చేకూరనున్నాయి.