రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శం
కాళేశ్వరం జలాలతో గుట్ట మీది గ్రామాలను సస్యశ్యామలం చేస్తా..
రైతును రాజుగా చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యం
పేదలకు వరం డబుల్బెడ్రూం పథకం
పల్లెప్రగతి ప్రారంభోత్సవంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి
బాన్సువాడ రూరల్, జూలై 1 : పల్లె ప్రగతి పథకం తో గ్రామాల రూపు రేఖలు మారాయని, తెలంగాణకు హరితహారం కార్యక్రమంతో ప్రతి పల్లె హరితశోభను సంతరించుకున్నదని రాష్ట్ర శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నాల్గో విడుత పల్లెప్రగతి ప్రగతిలో భాగంగా మండలంలోని సంగోజీపేట్, కోనాపూర్, పట్టణ ప్రగతిలో భాగంగా మున్సిపల్ పరిధిలోని కొయ్యగుట్ట తండాలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, కలెక్టర్ శరత్, అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రేతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. పది రోజుల పాటు నిర్వహించనున్న పల్లె ప్రగతిలో కార్యక్రమంలో హరితహారం, పారిశుద్ధ్యం, విద్యుత్ సమస్యల పరిష్కారం తదితర కార్యక్రమాలు చేపట్టి స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
కాళేశ్వరం జలాలతో గుట్టమీది గ్రామాలను సస్యశ్యామలం చేస్తా..
ఇంటింటికీ తాగునీరు, ప్రతి గుంటకు సాగునీరు అందించడమే తన లక్ష్యమన్నారు. కాళేశ్వరం జలాలతో గుట్ట మీది గ్రామాలైన సంగోజీపేట్, హన్మాజీపేట్, కాద్లాపూర్, కోనాపూర్, సోమ్లానాయక్ తండా తదితర గ్రామాల రైతుల భూములను సస్యశ్యామలం చేస్తానని భరోసా ఇచ్చారు. సిద్దాపూర్ గ్రామ శివారులో ఉన్న చెరువును రిజర్వాయర్గా నిర్మించి దాని ద్వారా గుట్ట మీది గ్రామాలకు సాగు నీరందిస్తానని తెలిపారు. రిజర్వాయర్ నిర్మా ణానికి రూ. 72 కోట్లతో పాటు దానికి కాలువల నిర్మాణానికి మరో రూ. 50 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని జాకోరా, చందూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 35 గ్రామాల రైతులకు దాదాపు 25వేల ఎకరాలకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగు నీరందించనున్నట్లు తెలిపారు. దీని కోసం సీఎం కేసీఆర్ రూ. 106 కోట్లు మంజూరు చేశారని, త్వరలోనే ఆయన చేతుల మీదుగా పనులను ప్రారంభిస్తామని తెలిపారు.
పేదలకు వరం.. డబుల్ బెడ్రూం పథకం
గూడు లేని పేదలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న డబుల్ బెడ్రూం పథకం పేదలకు వరంగా మారిందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కోనాపూర్ గ్రామంలో నిర్మించిన 30 డబుల్ బెడ్రూం ఇండ్లను స్పీకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా డబుల్బెడ్రూం ఇండ్లను నిర్మించి పేదలకు అందిస్తున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ చొరవతో బాన్సువాడ నియోజకవర్గంలో ఐదు వేల డబుల్బెడ్రూం ఇండ్లను మంజూరు చేశామని, నిర్మాణాలు దాదాపు పూర్తయినట్లు చెప్పారు. మరో ఐదు వేల డబుల్ బెడ్రూం ఇండ్లు సీఎం కేసీఆర్ మంజూరు చేశారని తెలిపారు.
సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని స్పీకర్ పోచారం అన్నారు. కోనాపూర్ గ్రామంలో నిర్మించిన రైతువేదిక భవనం, పల్లెప్రకృతి వనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం పులిగుండు తండా వద్ద హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు. కోనాపూర్, సంగోజీపేట్ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, ఎంపీపీ దొడ్ల నీరజ, జడ్పీటీసీ పద్మ, ఆర్డీవో రాజాగౌడ్, ట్రాన్స్కో ఎస్ఈ శేషాద్రిరావు, తహసీల్దార్ గంగాధర్, మున్సిపల్ కమిషనర్ రమేశ్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ దుద్దాల అంజిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్, సర్పంచులు లక్ష్మి, రమణారావు, భాస్కర్, బోనాల సుభాష్, బోర్లం, బాన్సువాడ, బుడి మి సహకార సంఘాల అధ్యక్షులు సంగ్రాం నాయక్, ఎర్వాల కృష్ణారెడ్డి, పిట్ల శ్రీధర్, ఎంపీటీసీలు జెట్టి హన్మాండ్లు, సుధాకర్రెడ్డి, శ్రావణి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.