న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. 63 రోజుల తర్వాత సోమవారం కేసుల సంఖ్య లక్ష దిగువకు చేరింది. అయితే టెస్టుల సంఖ్య భారీగా తగ్గడం కూడా కేసుల సంఖ్య తగ్గడానికి ఓ ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అంతకుముందు రోజు 35.7 లక్షల టెస్టులు చేయగా.. సోమవారం వాటి సంఖ్య కేవలం 15.9 లక్షలు మాత్రమే. టెస్టుల సంఖ్య తక్కువ కావడంతో సోమవారం పాజిటివిటీ రేటు 5.4 శాతానికి చేరింది. ఆదివారం ఇది 2.8 శాతంగా ఉంది.
సోమవారం దేశంలో మొత్తం 86,498 కేసులు నమోదు కాగా.. 2123 మంది చనిపోయారు. చివరిసారి ఏప్రిల్ 5వ తేదీన దేశంలో కేసులు లక్షలోపు నమోదయ్యాయి. సెకండ్ వేవ్లో ఇండియాలో అత్యధికంగా మే 6న 4,14,554 కేసులో రికార్డయిన విషయం తెలిసిందే. దేశంలో అత్యధికంగా తమిళనాడులో 19448 కేసులు నమోదు కాగా.. ఆ తర్వాతి స్థానాల్లో కర్ణాటక (11958), మహారాష్ట్ర (10219) నిలిచాయి.