ఆపత్కాలంలో అండగా నిలిచిన రాష్ట్ర సర్కారు
టీచర్లు, సిబ్బంది ఖాతాల్లో రూ.2 వేలు జమ
రేషన్ ద్వారా సన్నబియ్యం పంపిణీ
రుణపడి ఉంటామంటూ సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 7237 మందికి లబ్ధి
మంచిర్యాల/ కుమ్రం భీం ఆసిఫాబాద్(నమస్తే తెలంగాణ)/ఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 21:
కరోనా నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ టీచర్లు, సిబ్బందికి నెలకు రూ. 2వేలు, 25 కేజీల సన్న బియ్యం పంపిణీకి రాష్ట్ర సర్కారు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించిన విద్యాశాఖ లబ్ధిదా రుల ఎంపికను పూర్తి చేసింది. గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల టీచర్లు, సిబ్బందికి మంగళవారం నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నది. నగదును నేరుగా వారి ఖాతాల్లో జమచేస్తున్నది. ఉమ్మడి జిల్లాలో 7237 మందికి లబ్ధి చేకూరనుండగా, వీరందరికీ బుధవారం నుంచి 25 కిలోల రేషన్ బియ్యం అందిస్తున్నారు. ఈ ఆపత్కాలంలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న తమకు సర్కారు అండగా నిలవడంతో లబ్ధిదారుల కుటుంబాల్లో సంతోషం వ్యక్తమవుతున్నది.
ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు, సిబ్బందికి ప్రభుత్వం అందించే సాయం మంగళవారం సాయంత్రం నుంచే వారి ఖాతాల్లో జమవుతున్నది. కొందరికి బుధవారం కూడా నగదు జమ చేశారు. ఉమ్మడి జిల్లాలోని మంచిర్యాలలో 1,993 మంది టీచర్లు, 115 మంది బోధనేతర సిబ్బంది , ఆదిలాబాద్లో 1,302 మంది ఉపాధ్యాయులు, 142 నాన్ టీచింగ్ స్టాఫ్, నిర్మల్లో 2,230 టీచర్స్, 168 నాన్ టీచింగ్ స్టాఫ్, కుమ్రం భీం ఆసిఫాబాద్లో 1,002 మంది టీచర్స్, 285 మంది నాన్ టీచింగ్ స్టాఫ్తో కలిపి 7237 మంది లబ్ధిదారులను ప్రభుత్వం గుర్తించింది.
ఇప్పటికే జమ మొదలు
యూ డైస్ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్) ప్రకారం బోధన, బోధనేతర సిబ్బందిని విద్యాశాఖ గుర్తించింది. బుధవారం నుంచి రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీకి పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. పెద్ద మనసుతో సీఎం కేసీఆర్ తమను ఆదుకున్నారని, రుణపడి ఉంటామని ప్రైవేటు పాఠశాలల టీచర్లు, సిబ్బంది కృతజ్ఞతలు తెలుపుతున్నారు. సాయం చేసిన చేతులకు సర్వదా కృతజ్ఞతలు అంటూ వారు కొనియాడుతున్నారు.
సన్న బియ్యం పంపిణీ
యూడైస్ ప్రకారం తొలి విడుత జాబితాలో పేర్లు ఉన్నవారికి వారి బ్యాంకు ఖాతాల్లో రూ.2 వేల నగ దు బదిలీ చేస్తున్నారు. ఇక సన్న బియ్యం పంపిణీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ అవసరమైన ఏర్పా ట్లు చేసింది. పాఠశాల సమీపంలో, తాము నివసిం చే పరిసరాల్లోని రేషన్ దుకాణంలో బియ్యం తీసుకునేలా చర్యలు తీసుకున్నట్లు పౌరసరఫరాల జిల్లా అధికారి ప్రేమ్కుమార్ తెలిపారు. విద్యాశాఖ సూ చించిన జాబితాలోని లబ్ధిదారులకు ఆధార్ కార్డు ఆధారంగా ప్రభుత్వం తరఫున సన్న బియ్యం అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రైవేట్ స్కూళ్ల లో పనిచేస్తున్న టీచర్లు, ఇతర సిబ్బంది సంఖ్యకు అనుగుణంగా బుధవారం నుంచి ఈనెల 25 వరకు ఐదు రోజుల పాటు సన్నబియ్యం పంపిణీ చేస్తారు.
సాయం చేసే చేతులే మిన్న..
మంచిర్యాల అర్బన్, ఏప్రిల్ 21 : దేశాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారితో కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడినయ్. పనిచేస్తేనే పొట్టగడిచే మాలాంటి ప్రైవేటు టీచర్లు, సిబ్బందిని మాత్రం ఎవ్వరూ పట్టించుకోలేదు. ఏడాది కాలంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నం. అందరూ మాటలు చెప్పిన్రు తప్ప, సాయం చేసింది లేదు. మాట్లాడే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్న అన్నట్లు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. సీఎం కేసీఆర్ మాత్రం మా పరిస్థితిని అర్థం చేసుకున్నరు. ఈ ఆపత్కాలంలో అండగా నిలిచేందుకు ముందుకు వచ్చిండ్రు. రూ. 2వేలు ఖాతాలో వేసిండ్రు. ఇగ నెలకు 25 కిలోల బియ్యం ఇస్తరని చెప్పి, మా కడుపు నింపుతున్నడు.
మాట నిలబెట్టుకున్నడు..
తాండూర్, ఏప్రిల్ 21 : నా పేరు ఊరుగంటి నాగమణి. నేను తాండూర్లోని విద్యాభారతి ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నా. కరోనా సాయం కింద ప్రభుత్వం ప్రైవేట్ టీచర్లకు అందించే సాయానికి దరఖాస్తు చేసుకున్నా. ప్రభుత్వం లబ్ధిదారుగా ఎంపిక చేసింది. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం నా బ్యాంకు ఖాతాలో రూ.2 వేలు జమయ్యాయి. మెస్సేజ్ కూడా వచ్చింది. ప్రభుత్వం అందించిన సాయంతో కొంతలో కొంత ఆర్థికంగా చేయూత కలిగింది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు తానే సాటి. ఈ సాయంతో మాలాంటి నిరుపేద కుటుంబాలు కొంతైనా ఆర్థికంగా నిలదొక్కుకుంటాయి. లాక్డౌన్ కష్ట కాలంలో మా పాఠశాల యాజమాన్యం కొద్దిగా ఆదుకున్నది. ప్రస్తుత విపత్కర సమయంలో ఏమీ తోచని పరిస్థితి నెలకొంది. జీతాలు లేకుండా ఇల్లు గడవడానికి ఇబ్బందిపడుతున్న సమయంలో సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో మమ్మల్ని ఆదుకోవడానికి ముందుకు వచ్చిండ్రు. సారుకు జీవితాంతం రుణపడి ఉంటాం.