శేరిలింగంపల్లి, మే 31: గచ్చిబౌలిలోని టిమ్స్ దవాఖానకు 24 గంటలు తాగునీటి సరఫరా అందించడమే లక్ష్యంగా నూతన పైపులైన్ నిర్మాణ పనులను చేపట్టడం జరుగుతుందని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. సోమవారం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని టిమ్స్ దవాఖాన సమీపంలో విప్రో జంక్షన్ వద్ద నూతనంగా చేపట్టనున్న మంజీరా పైపులైన్ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గచ్చిబౌలి జలమండలి కార్యాలయం నుంచి టిమ్స్ దవాఖాన వరకు 300 ఎంఎం డయా తాగునీటి నిర్మాణ పనులు చేపట్టడం జరుగిందన్నారు. టిమ్స్కు నిరంతరం మంజీరా నీటి సరఫరా అందించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. టిమ్స్లో వైద్యసేవలందుకుంటున్న రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పైపులైన్ల నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జలమండలి జీఏం రాజశేఖర్, డీజీఏం సత్యనారాయణ, మేనేజర్ వెంకట్రెడ్డి, కార్పొరేటర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.