హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, అందోల్, జహీరాబాద్ నియోజకవర్గాలను సస్యశ్యామలంచేసే సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ సర్వే పనులు ఈ నెల 12న మొదలుకానున్నాయి. సుమారు 2.19 లక్షల ఎకరాలకు సాగునీరందించే ఈ లిఫ్ట్ సర్వే పనులను ఆర్థికమంత్రి హరీశ్రావు ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు ఈ ఎత్తిపోతల పథకం పనుల నిర్వహణపై మంగళవారం మంత్రి సమీక్షించారు. సర్వే పనులను వేగంగా పూర్తిచేయాలని అధికారులు, కన్సల్టెంట్ ఏజెన్సీని ఆదేశించారు. సమీక్షలో ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, చింతా ప్రభాకర్, సీఈ అజయ్కుమార్, ఎస్ఈ మురళీధర్, ఈఈ సుబ్రహ్మణ్యప్రసాద్, ఈఈ మధుసూదన్రెడ్డి పాల్గొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మల్లన్నసాగర్ నుంచి 20 టీఎంసీల నీటిని సింగూరు రిజర్వాయర్కు తరలించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ రిజర్వాయర్ బ్యాక్వాటర్ ఆధారంగా మంజీర నదిపై కుడివైపున సంగమేశ్వర, ఎడమవైపు బసవేశ్వర ఎత్తిపోతల పథకాలను చేపడుతారు. సంగమేశ్వరతో సంగారెడ్డి, జహీరాబాద్, అందోల్ (కొన్ని మండలాలు) నియోజకవర్గాలు, బసవేశ్వరతో నారాయణ్ఖేడ్, అందోల్ (కొన్ని మండలాలు) నియోజకవర్గాల్లో 3.84 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇప్పటికే సర్వే టెండర్లను పూర్తిచేసింది. ఈ రెండు ప్రాజెక్టులకు కలిపి సుమారు రూ.4,000-4,500 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. సంగమేశ్వర లిఫ్ట్ ప్రాజెక్టులో భాగంగా 2 పంప్హౌజ్లు నిర్మిస్తారు. మొదటి పంప్హౌజ్ ద్వారా ఐదులాపూర్ నుంచి వెంకటాపూర్ దాకా 125 మీటర్ల ఎత్తు వరకు నీటిని ఎత్తిపోయనున్నారు. ఇక్కడినుంచి జహీరాబాద్, హద్నూర్, కంది కాల్వల ద్వారా 2.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తారు. జహీరాబాద్ కాల్వపై అంతర్భాగంగా హతికుర్దు వద్ద మరో పంప్హౌజ్ను ఏర్పాటుచేసి గోవిందాపూర్ వరకు సుమారు 40 మీటర్ల ఎత్తులోకి నీటిని ఎత్తిపోస్తారు. ఈ లిఫ్ట్ ద్వారా సుమారు 42 వేల ఎకరాలకు నీళ్లందుతాయి. మొత్తంగా సంగమేశ్వర లిఫ్ట్లో భాగంగా 958.6 కిలోమీటర్ల పొడవైన కాలువలు తవ్వనున్నారు. సంగమేశ్వర లిఫ్ట్ సర్వే కోసం రూ.16 కోట్లు వెచ్చించనున్నారు.
బసవేశ్వర లిఫ్ట్ ద్వారా అందోల్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో 1.65 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. అందోల్ నియోజకవర్గంలో 36,050, నారాయణ్ఖేడ్లో 1.28 లక్షల ఎకరాలకు ప్రయోజనం కలుగనున్నది. మొత్తం 8 మండలాల రైతులు లబ్ధి పొందనున్నారు. ఈ ప్రాజెక్టు సర్వే పనులు త్వరలో ప్రారంభంకానున్నాయి. ఇందుకు దాదాపు రూ.11 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా.