న్యూఢిల్లీ: ఇప్పటికే నూతన ఐటీ నిబంధనల అమలులో కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణకు దిగిన మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ దేశ సార్వభౌమత్వం పట్ల ధిక్కార స్వరం వినిపిస్తున్నది. తాజాగా భారతదేశంలోని భూభాగాలను తప్పుగా చూపింది. కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మకశ్మీర్, లడఖ్లను వేరే దేశంగా చూపి, భారత రాజకీయ చిత్ర పటాన్ని వక్రీకరించింది.
ఇప్పటికే నూతన ఐటీ నిబంధనలను అమలు చేసే విషయంలో కేంద్రం-ట్విట్టర్ మధ్య ఉప్పూనిప్పూ అన్న పరిస్థితులు ఉన్నాయి. తాజా చర్యతో ట్విట్టర్పై కేంద్రం కఠిన చర్యలు తీసుకోనున్నదని సమాచారం.
ట్విటర్ తన ‘ట్వీప్ లైఫ్’ సెక్షన్లో జమ్ముకశ్మీర్, లడఖ్ ప్రాంతాలను భారత్ భూభాగాలుగా చూపకపోగా, వాటిని వేరే దేశంగా పేర్కొంది. ఈ సంగతిని గుర్తించిన నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. గతంలో కూడా లేహ్ ప్రాంతాన్ని చైనాలో భాగంగా తప్పుగా గుర్తించిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే నూతన ఐటీ నిబంధనలు పాటించడంలో విఫలమైనందుకు ట్విటర్పై కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో అది తనకు ఉన్న మధ్యవర్తిత్వ హోదాను కోల్పోయింది. ఈ నేపథ్యంలో ట్విటర్పై పలు రాష్ట్రాల్లో క్రిమినల్ కేసులూ నమోదవుతున్నాయి.
దీనికి తోడు ఇటీవల కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఖాతానూ గంటపాటు నిలిపివేసింది. దీనిపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ట్విటర్ ధిక్కార ధోరణిని నిలదీసినందుకే తన ఖాతా నిలిపేసి ఉంటారని రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు.