సిటీబ్యూరో, జూన్ 10(నమస్తే తెలంగాణ): మహా నగరంలో నీటి చౌర్యంపై జలమండలి విజిలెన్స్ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే నీటిని చోరీ చేస్తున్న వందల మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసిన జల మండలి విజిలెన్స్ అధికారులు, తాజాగా మరో నలుగురిపై కేసులను నమోదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని బోలానగర్లో ఒకే వీధిలో (ఇంటి నెం: 8-2-752/27)లో నివసించే షేక్ దావుద్, సోగ్రా బేగం (ఇంటి నెం: 8-2-752/30, నసీన్ రజత్ఖాన్ (ఇంటి నెం: 8-2-752/28), మమహ్మద్ తాఖీ (ఇంటి నెం: 8-2-752/21) అనే వ్యక్తులు జలమండలి అధికారుల నుంచి ఎలాంటి అనుమతులను పొందకుండానే అక్రమంగా నల్లాలను ఏర్పాటు చేసుకున్నారు. విజిలెన్స్ అధికారుల తనిఖీలలో ఈ విషయం వెలుగులోకి రావడంతో సంబంధిత వ్యక్తులపై స్థానిక బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేశారు. జలమండలి అధికారుల అనుమతులను పొందకుండా నల్లాలను ఏర్పాటు చేసుకుంటే క్రిమినల్ కేసులను నమోదు చేస్తామని విజిలెన్స్ అధికారులు తెలిపారు. ఎవరైనా అక్రమ నల్లా కనెక్షన్లను ఏర్పాటు చేసుకుంటే, డొమెస్టిక్ అనుమతులు పొంది కమర్షియల్ అవసరాలకు వినియోగించినా.. 99899 98100, 99899 92268 నెంబర్లకు ఫోన్ ద్వారా సమాచారం అందించాలని అధికారులు సూచించారు.