హన్మకొండ, ఏప్రిల్ 21 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై చిన్న చూస్తున్నదని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యుల సమక్షంలో బుధవారం హన్మకొండలోని మంత్రి కార్యాలయంలో 18 మందికి మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్ బీ ఫారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి నేతలందరూ కట్టుబడి ఉండాలని సూచించారు. టిక్కెట్లు రానివారు బాధపడొద్దని, వారికి సముచిత స్థానం కల్పిస్తామని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లు హామీ ఇచ్చారని చెప్పారు. పార్టీ గెలుపే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో మద్దతు ఇచ్చినట్టుగానే గ్రేటర్ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులకు వరంగల్ ప్రజల ఆశీర్వాదం ఉండాలని విజ్ఞపి చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలోనే వరంగల్ నగరంలో అభివృద్ధి జరుగుతున్నదని, ఇంకా జరుగాల్సింది ఉన్నదని చెప్పారు. వరంగల్కు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒరగబెట్టిందేమీ లేదని పునరుద్ఘాటించారు. వరంగల్ నగర ప్రజల ఆశీర్వాదంతో బల్దియాపై గులాబీ జెండా ఎగురడం ఖాయమన్నారు. అనంతరం మంత్రి సత్యవతిరాథోడ్ మాట్లాడుతూ.. జీడబ్ల్యూఎంసీ ఎన్నికల్లో మొత్తం 66 సీట్లు గెలిచి సీఎం కేసీఆర్కు కానుకగా ఇస్తామని చెప్పారు.
ముంబైకి పుణె.. హైదరాబాద్కు వరంగల్
వరంగల్ నగరంపై బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. కేంద్రం నిధులతో వరంగల్ అభివృద్ధి జరిగినట్టు కొందరు ప్రతిపక్ష నేతలు మాట్లాడుతున్నారని.. తెలంగాణ నుంచి కేంద్రానికి చెల్లించిన పన్నులు ఎంత, తిరిగి కేంద్రం రాష్ర్టానికి ఎన్ని నిధులు ఇచ్చిందో కూడా చెప్పాలని డిమాండ్ చేశారు. ముంబైకి పుణే ఎలాగో.. హైదరాబాద్కు వరంగల్ను అలా తీర్చిదిద్దనున్నట్లు వినోద్కుమార్ స్పష్టం చేశారు. సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎంపీలు బండా ప్రకాశ్, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బస్వరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్, టీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్చార్జి గ్యాదరి బాలమల్లు, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, సమన్వయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్కు ఓటేస్తే.. అభివృద్ధికి వేసినట్టే
మంత్రి పువ్వాడ అజయ్కుమార్
ఖమ్మం: టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధికి ఓటు వేసినట్టేనని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. బుధవారం ఖమ్మంలోని 35వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి బోజెడ్ల రామ్మోహన్రావు తరఫున రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఖమ్మం నగరాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని, హైదరాబాద్ తర్వాత ఖమ్మమే అత్యంత అభివృద్ధి చెందిందని చెప్పారు. నగరాభివృద్ధికి అడిగిన వెంటనే నిధులు ఇచ్చారని గుర్తుచేశారు. గతంలో ఖమ్మం మున్సిపాలీటీని పాలించిన కాంగ్రెస్, సీపీఎం పార్టీలు చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. నగరంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి టీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటేయాలని విజ్ఞప్తిచేశారు.