కరోనా ప్రభావంతో డ్రై ఫూట్స్ అమ్మకాలు పెరిగాయి. మహమ్మారి నుంచి తమను తాము కాపాడుకోవడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు డ్రై ఫూట్స్ను తినేందుకు అనేక మంది ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా పోషక విలువలున్న బాదంపప్పు, కాజు, పిస్తా, వాల్నట్స్, ఎండుద్రాక్ష, ఖర్జూర, మామ్రబాదం, ఆఫ్ఘాన్ మామ్రబాదం, కాజు, అంజీర్, ప్లెయిన్ పిస్తా, కటింగ్ పిస్తా, సాల్ట్ పిస్తా, వాల్నట్ (అక్రోట్), కివి, డ్రై పైనాపిల్, మామ్ర బాదం నూనె, బాదం నూనె, సీడ్లెస్ ఖర్జూరాలు, కాలా కిస్మిస్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో కాజు, బాదం, పిస్తాల విక్రయాలే ఎక్కువగా జరుగుతున్నాయి. ఓ వైపు కరోనా భయం.. మరోవైపు రంజాన్ మాసం ఉండటంతో డ్రై ఫూట్స్ వ్యాపారం పెరిగిందని పలువురు హోల్సేల్, రిటైల్ వర్తకులు చెబుతున్నారు. పెరుగుతున్న వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్లోని బేగంబజార్తో పాటు, మహబూబ్ మాన్షన్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో హోల్సేల్ విక్రయదారులు ఆఫర్లు పెట్టడం విశేషం. ఇదిలా ఉంటే సూపర్ మార్కెట్లలో కన్నా బేగంబజార్, ఇతర ప్రాంతాల్లోని హోల్సేల్ షాపుల్లోనే తక్కువ ధరకు డ్రై ఫూట్స్ దొరుకుతున్నట్లు కొనుగోలు దారులు అంటున్నారు. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, అమెరికా లాంటి దేశాల్లో పండుతున్న పండ్లను ఢిల్లీ, ముంబయికి చెందిన వ్యాపారులు దిగుమతి చేసుకొని హైదరాబాద్ వ్యాపారులకు అందజేస్తున్నారు.
డ్రైఫూట్స్తో అనేక ఉపయోగాలున్నాయి. ఈ పండ్లలో పోషక విలువలు ఎక్కువ. వీటిని తింటే రోగ నిరోధక శక్తి పెరగడం ఖాయం. విటమిన్ డి,సీ,ఈ, కే, బీ8, జింక్ ఉన్న బాదంను నిత్యం తింటే ఎముకలు, కండరాలు, నరాలు, దంతాల సమస్యలు దరి చేరవు. కాజుతో చర్మ సమస్యలు రావు. పిస్తాలో ఉండే ఫైబర్, బీ6 విటమిన్తో అనేక ప్రయోజనాలున్నాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని వైద్యులు, న్యూట్రిషియన్లు తాజా పండ్లతోపాటు డ్రై ఫ్రూట్స్ తినాలని చెప్పడంతో ప్రజలు వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో వివిధ రకాల డ్రై ఫూట్స్ విక్రయాలు పెరిగాయి. దేశ, విదేశాల నుంచి నాణ్యతతో కూడిన డ్రై ఫ్రూట్స్ను దిగుమతి చేసుకుని కశ్మీర్హౌస్లో అందుబాటులో ఉంచి తక్కువ ధరలకే విక్రయిస్తున్నాం. వివిధ జిల్లాల నుంచి రిటైల్ వ్యాపారులు కూడా ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తున్నారు. – రాజ్కుమార్ టండన్,కశ్మీర్హౌస్ అధినేత, బేగంబజార్
కరోనాను ఎదుర్కొనేందుకు ప్రతిఒక్కరూ ఇమ్యునిటీని పెంచుకోవాలని చూస్తున్నారు. అందుకే డ్రై ఫ్రూట్స్ అమ్మకాలు బాగా పెరిగాయి. గతంలో పోలిస్తే ప్రస్తుతం డ్రై ఫ్రూట్స్ విక్రయాలు వంద శాతం పెరిగాయి. ప్రస్తుతం ఉన్న డిమాండ్ దృష్ట్యా ముంబయి, ఢిల్లీ నగరాల నుంచి దిగుమతి చేసుకుని హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాలకు కూడా తరలిస్తున్నాం. డ్రై ఫ్రూట్స్తో పాటు మిరియాలు, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, శొంఠికి కూడా గిరాకీ పెరిగింది. – మహేశ్కుమార్ అగర్వాల్, డ్రై ఫ్రూట్స్ డీలర్, గుడి మల్కాపూర్