మేడ్చల్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): తపాల శాఖ మైక్రో ఏటీఎం ద్వారా రైతుబంధు నగదు పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఇందులోభాగంగా మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని.. అందుబాటులో ఉన్న పోస్టాఫీసులకు వెళ్లి నగదును పొందచ్చని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్వేతా మహంతి తెలిపారు. కరోనా నేపథ్యంలో బ్యాంకులు, ఏటీఎంలకు వెళ్లి నగదు తీసుకునేందుకు ఉన్న ఇబ్బందికర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తపాల శాఖ ద్వారా రైతులు నగదు డ్రా చేసుకునే అవకాశం కల్పించామన్నారు. ఏ బ్యాంకులో ఖాతా ఉన్నా ఆధార్ కార్డు, మొబైల్ నంబర్తో పోస్టాఫీసు నుంచి నగదు డ్రా చేసుకోవచ్చని స్పష్టం చేశారు ఆధార్ కార్డుతో బ్యాంకు ఖాతా అనుసంధానం ఉన్న వారికే ఈ వెసులుబాటు ఉంటుందని.. రోజుకు రూ.10 వేలకు మించకుండా నగదు పొందే అవకాశం ఉందన్నారు. ఇదిలా ఉంటే జిల్లాలోని 26,266 మంది రైతుల ఖాతాల్లో ప్రభుత్వం రూ.24.62 కోట్లను జమ చేసింది. జిల్లాలోని మొత్తం 40,291 మంది రైతులకు రైతు బంధు రానున్నది.