న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దులోని లఢక్ ప్రాంతంలోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వద్ద ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు ఇరు దేశాల సైనిక అధికారులు శనివారం 12వ రౌండ్ చర్చలు జరుపనున్నారు. ఇండియన్ ఆర్మీ, చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ)కు చెందిన కార్ప్స్ కమాండర్ ర్యాంక్ ఆఫీసర్స్ మధ్య శనివారం ఉదయం 10.30 గంటలకు చైనా వైపు గల ఎల్ఏసీ పరిధిలోని మోల్డో వద్ద ఈ చర్చలు జరుగుతాయని ఆర్మీ వర్గాలు తెలిపాయి. హాట్ స్ప్రింగ్స్, గోగ్రా ప్రాంతాల్లో ఇరు దేశాల బలగాలను ఉపసంహరించుకునే అంశంపై ప్రధానంగా చర్చలు జరుగనున్నట్లు వెల్లడించాయి.
కాగా, ఈ ఏడాది ఏప్రిల్ 9న ఇరు దేశాల సైనిక అధికారుల మధ్య 11వ విడత చర్చలు జరిగాయి. ఘర్షణ ప్రాంతాల అన్నింటి నుంచి ఇరువైపులా బలగాల ఉపహరణే సరిహద్దు వివాదం పరిష్కారానికి మార్గమని భారత సైనిక అధికారులు స్పష్టం చేశారు. గత ఏడాది జూన్లో భారత్, చైనా మధ్య ఘర్షణలు తీవ్రస్థాయికి చేరినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సైనిక, దౌత్యపరంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి మధ్యలో జరిగిన 9వ రౌండ్ చర్చల అనంతరం పాంగోంగ్ త్సో సెక్టార్ నుంచి భారత్, చైనా సైనిక దళాలను వెనక్కి మళ్లించారు. అయినప్పటికీ లఢక్ సరిహద్దు ప్రాంతాల్లో ఇరు దేశాలకు చెందిన సుమారు 50 వేల మంది సైనికులు మోహరించి ఉన్నారు.