న్యూఢిల్లీ: సరిహద్దుల్లో శాంతిస్థాపనే ధ్యేయంగా భారత్-చైనా మధ్య నేడు 11వ విడత కోర్ కమాండర్ల స్థాయి సైనిక చర్చలు జరగనున్నాయి. లడఖ్లోని పాంగాంగ్ సరస్సు ప్రాంతం నుంచి బలగాలను ఉపసంహరించుకున్న తర్వాత ఇరు దేశాల మధ్య జరుగుతున్న ఈ భేటీ కీలకం కానుంది. ఈ సందర్భంగా లడఖ్లోని గోగ్రా, హాట్ స్ప్రింగ్స్, డెప్సాంగ్ మైదానాల్లో ఘర్షణ పాయింట్ల నుంచి కూడా బలగాలను ఉపసంహరించుకునే అంశంపై అధికారులు చర్చించనున్నారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు తూర్పు లడఖ్లోని చుషుల్ ప్రాంతంలో ఉన్న భారత్ శిబిరం వేదికగా సమావేశం ప్రారంభమవుతుంది. లేహ్ కేంద్రంగా పనిచేస్తున్న 14 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ పీజీకే మీనన్ భారత బృంధానికి నేతృత్వం వహిస్తున్నారు.
గతేడాది మే నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాస్తవాధీన రేఖ వెంబడి ఇరు దేశాలు భారీగా సైన్యాన్ని మోహరించిన విషయం తెలిసిందే. భారత్-చైనా మధ్య ఇప్పటికే పలుమార్లు సైనిక, దౌత్య చర్చలు జరిగాయి. ఇరుదేశాల సైనికుల మధ్య ఈ ఏడాది ఫిబ్రవరి 19న పదో విడుత సమావేశం జరిగింది. చైనా భూభాగంలోని మాల్డో పోస్టు వద్ద జరిగిన ఈ చర్చల అనంతరం పాంగాంగ్ సరస్సు ప్రాంతం నుంచి ఇరు దేశాలు తమ బలగాలను ఉపసంహరించుకున్నాయి.