తోటి కళాకారుడి కోసం ప్రత్యేకంగా రూపొందించిన శిల్పిగురు
త్వరలో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో అందజేత
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ)/ కెరమెరి : ఆ ఇద్దరు కళాకారులు ఆదివాసీ సమాజానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారు. మారుమూల పల్లెల్లో పుట్టి తమ కళలను ప్రపంచానికి చాటి చెప్పారు. ఒకరు గుస్సాడీ నృత్యంతో పద్మశ్రీ అవార్డుకు ఎంపిక కాగా, మరొకరు ఇత్తడి కళారూపాలకు జీవం పోసి రాష్ట్రపతి చేతుల మీదుగా ‘శిల్పి గురు’ అవార్డు అందుకున్నారు. జాతీయ స్థాయిలో ప్రదర్శనలు ఇచ్చి జాతికే వన్నె తెచ్చి ఎందరికో ఆదర్శంగా నిలిచారు.. కనకరాజు, జ్ఞానేశ్వర్. ఇటీవల పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన కనక రాజుకు కానుక అందించేందుకు జ్ఞానేశ్వర్ ఇత్తడితో ప్రత్యేకంగా గుస్సాడీ విగ్రహాన్ని తయారు చేశారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయి గ్రామానికి చెందిన కనకరాజు రాష్ట్రంలోనే కాదు.. దేశ రాజధాని ఢిల్లీలోనూ ఆదివాసీ ప్రదర్శనలు ఇచ్చి జాతికి వన్నె తెచ్చారు. దీంతో భారత ప్రభుత్వం ఆయన ప్రత్యేకతను గుర్తించి పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో కనక రాజును ఇప్పటికే అనేక మంది సన్మానిస్తూ అభినందిస్తుండగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ సంఘాల నాయకులు త్వర లో సన్మానించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటు ప్రత్యేక బహుమతిని ఇచ్చేందుకు కొంత మంది ఆదివాసీ నాయకులు కెరమెరి మండలం కెస్లాగూడకు చెందిన కోవ జ్ఞానేశ్వర్ను సంప్రదించారు. గుస్సాడీతో ప్రత్యేక గుర్తింపు పొందిన కనక రాజుకు ఇత్తడితో గుస్సాడీ కళాఖండం తయారు చేయాలని సూచించారు. దీంతో గుస్సాడీ కిరీటం ధరించిన ఇత్తడి విగ్రహాన్ని జ్ఞానేశ్వర్ ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. వారసత్వంగా వస్తున్న ఇత్తడి హస్తకళల ద్వారా ప్రత్యేకంగా గుర్తింపు పొంది 2015, డిసెంబర్ 9న ఢిల్లీలో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా శిల్పిగురు అవార్డు పొందారు జ్ఞానేశ్వర్.
కళాకారుడి కోసం ప్రత్యేకంగా..
పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన కనకరాజుకు బహూకరించేందుకు మరో కళాకారుడు కోవ జ్ఞానేశ్వర్ ఇత్తడితో గుస్సాడీ విగ్రహం తయారు చేయడం విశేషం. ఇప్పటి వరకు చేతివృత్తితో ఎవ్వరూ తయారు చేయని విధంగా చిత్తశుద్ధితో విగ్రహాన్ని జ్ఞానేశ్వర్ చేసి చూపించాడు. తనకున్న మేథోశక్తిని ఉపయోగించి కేవలం తేనె మైనంతో గుస్సాడీ ఆకారాన్ని తీర్చిదిద్దాడు. ఆ తర్వాత నల్లని మట్టిని దానిపై పూసి ఎండబెట్టాడు. పైన మరోసారి మట్టితో రెండుసార్లు పూతపూసి ఎండలో ఆరబెట్టాడు. అనంతరం బట్టిలో వేశాడు. మంట వేడికి మైనం కరిగిపోగా.. అందులో మరిగించిన ఇత్తడిని పోశాడు. అది చల్లారిన తర్వాత మొత్తం మట్టిని తొలగిస్తే అందమైన ఇత్తడి గుస్సాడీ విగ్రహం సిద్ధమైంది. ఈ గుస్సాడీ విగ్రహం తయారు చేసేందుకు మొత్తం 15 రోజుల సమయం పట్టిందని హస్తకళాకారుడు, శిల్పిగురు కోవ జ్ఞానేశ్వర్ తెలిపారు. కాగా, త్వరలో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించబోయే సన్మాన సభలో దీనిని కనకరాజుకు అందించనున్నారు.
ఇవి కూడా చదవండి..
ముందుగా కష్టమైన సబ్జెక్టులను ఎంచుకోండి : ‘పరీక్షా పే చర్చ’లో మోదీ
కరోనా టీకాలపై మహారాష్ట్ర రాజకీయం: ప్రకాశ్ జవదేకర్