తాండూరు, మే 12 : కరోనాను నియంత్రించేందుకు ప్రభుత్వం బుధవారం నుంచి విధించిన ‘లాక్డౌన్’ను ప్రజలు విధిగా పాటించారు. తాండూరు నియోజకవర్గంలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నిత్యావసర సరుకులు, అత్యవసర పనులకు బయటకు వచ్చారు. 10 గంటల తరువాత దుకాణాలు, వ్యాపార సముదాయాలన్నీ బంద్ చేయడంతో రోడ్లు నిర్మానుష్యంగా కనిపించాయి. తాండూరు పట్టణంతో పాటు తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండల పరిధిలోని పల్లె ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. ముఖ్యంగా పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది అంతరాష్ట్ర చెక్పోస్టులతో పాటు పట్టణంలోని ప్రధాన రోడ్లపై గట్టి భద్రత చేపట్టారు. డీఎస్పీ లక్ష్మీనారాయణ, తాండూరు పట్టణ సీఐ రాజేందర్రెడ్డి, రూరల్ సీఐ జలేందర్రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బృందాలుగా ఏర్పడి ప్రధాన కూడళ్లు, కాలనీలు, వీధుల్లో పికేటింగ్ ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి.
పరిగి పట్టణంలో..
పరిగి, మే 12 : కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన 10 రోజుల లాక్డౌన్తో పరిగి పట్టణంలోని వీధులతో పాటు ప్రధాన రోడ్లు నిర్మానుష్యంగా కనిపించాయి. బుధవారం ఉదయం 6 గంటల నుంచి 10గంటల లాక్డౌన్ సడలింపు సమయం కావడంతో పట్టణ ప్రజలు తమకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసేందుకు రోడ్లుపైకి రాగా 10 గంటల తరువాత ఇంటికే పరిమితం కావడంతో పట్టణ రోడ్లు జనాలు లేక బోసిబోయాయి. రోడ్లుపైకి వచ్చిన ప్రతి వాహనాన్ని ఎస్సై క్రాంతికుమార్ తనిఖీలు నిర్వహించి, వాహనదారులకు అవగాహన కల్పించారు.
లాక్డౌన్ నిబంధనలు పాటించాలి
లాక్డౌన్ నిబంధనలు ప్రతిఒక్కరూ పాటించాలని ఎస్సై శ్రీశైలం అన్నారు. బుధవారం పూడూరు మండల పరిధిలోని పలు గ్రామ పంచాయతీల్లో హైదరాబాద్-బీజాపూర్ హైవే రోడ్డు మన్నెగూడ చౌరస్తాలో తనిఖీలు చేశారు. జిల్లా సరిహద్దు అంగడి చిట్టంపల్లి స్టేజీ (హైవే రోడ్డు) వద్ద చెక్ పోస్టు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై సురేశ్ అన్నారు. బుధవారం లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలో పోలీస్ సిబ్బందితో కలిసి లాక్డౌన్ నిబంధనలపై వివరించారు.
కొత్లాపూర్ చెక్పోస్ట్ వద్ద..
తాండూరు మండలంలో కరణ్కోట పోలీసులు పకడ్బందీ పహారా చేపట్టగా, కొత్లాపూర్ చెక్పోస్ట్ వద్ద కర్ణాటక నుంచి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. గౌతాపూర్ జంక్షన్ వద్ద నిబంధనలపై ఎస్సై ఏడుకొండలు అవగాహన కల్పించారు. ఎమర్జెన్సీ ఉండే వారు ఈ పాస్ ద్వారా పాసులు పొందాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పెద్దేముల్ మండల పరిధిలో..
మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ప్రజలు ప్రభుత్వం విధించిన లాక్డౌన్కు సహకరించారు. తాండూరు నుంచి సంగారెడ్డి వెళ్లే మార్గంలోని ప్రధాన రహదారి పూర్తిగా నిర్మానుష్యంగా మారింది. లాక్డౌన్ను ఎస్సై చంద్రశేఖర్ గ్రామాలను సందర్శిస్తూ ఎప్పటికప్పుడు సిబ్బందిని అప్రమత్తం చేస్తూ పరిస్థితులను పర్యవేక్షించారు.
దోమలో
మండల కేంద్రంలోని హనుమాన్ మందిర ప్రధాన కూడలి నిర్మానుష్యంగా కనిపించింది. పోలీసు పహారా కొనసాగగా ప్రజలు రోడ్లపైకి రాకుండా ఇండ్లలోనే ఉండి లాక్డౌన్కు మద్దతు తెలిపారు.
అన్ని రూట్లల్లో బస్ సౌకర్యం
లాక్ డౌన్ నేపథ్యంలో నేటి నుంచి ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి ఉదయం 8:30 వరకు ఆయా ప్రాంతాలకు ఆర్టీసీ బస్ సౌకర్యం కల్పిస్తునట్లు పరిగి డిపో మేనేజర్ బద్రినారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ నుంచి రావులపల్లికి 5 బస్సులు, పరిగి నుంచి షాద్నగర్ 3, పరిగి నుంచి మహబుబ్నగర్ 3 బస్సులు నడుపనున్నట్లు పేర్కొన్నారు.