న్యూఢిల్లీ: న్యూజీలాండ్ యూట్యూబర్ కార్ల్ రాక్ వీసాను కేంద్రం ఏడాదిపాటు బ్లాక్లిస్టులో పెట్టింది. కార్ల్ రాక్ వీసాను ఏడాదిపాటు బ్లాక్లిస్టులో పెట్టామని, ఏడాది పూర్తయ్యే వరకు అతని వీసా బ్లాక్ లిస్టులోనే ఉంటుందని భారత ప్రభుత్వం స్పష్టంచేసింది. సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొనడం వల్లే భారత్ కార్ల్ రాక్ వీసాను బ్లాక్ లిస్టులో పెట్టిందన్న ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చింది. వీసా నిబంధనలు, షరతులను ఉల్లంఘించినందుకే అతన్ని బ్లాక్ లిస్ట్లో చేర్చినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది.
టూరిస్ట్ వీసాపై వచ్చిన కార్ల్ రాక్ వ్యాపారాల్లో భాగం అయ్యాడని, ఇది వీసా నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని హోంశాఖ పేర్కొన్నది. వచ్చే ఏడాది వరకు కార్ల్ రాక్ను దేశంలోకి అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. కాగా, భారత సర్కారు తన వీసాను బ్లాక్లిస్టులో పెట్టడంపై కార్ల రాక్ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘269 రోజుల నుంచి నా భార్యను చూడనివ్వడం లేదు. భారత ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోంది. కనీసం కారణాలైనా చెప్పమని ఎన్ని మెయిల్స్ పంపినా బదులు లేదు. నా భార్య, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా బదులు ఇవ్వడం లేదు’ అని కార్ల్ రాక్ ఓ వీడియోలో వాపోయాడు.
న్యూజిల్యాండ్కు చెందిన కార్ల్ ఎడ్వర్డ్ రైస్కు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉన్నది. ‘కార్ల్ రాక్’ పేరుతో యూట్యూబర్గా పాపులర్ అయిన కార్ల్.. ట్రావెల్ సేఫ్టీ, వివిధ ప్రాంతాల్లో కల్చర్, వేరే దేశాల్లో ఫారినర్లకు ఎదురయ్యే మోసాల మీద వీడియోలు తీస్తుంటాడు. ప్రస్తుతం అతని ఛానెల్కు 1.8 మిలియన్ సబ్ స్క్రైబర్లు ఉన్నారు. 2019లో హర్యానాకు చెందిన మనీషా మాలిక్ను ఆయన పెండ్లి చేసుకున్నాడు. అయితే కిందటి ఏడాది అక్టోబర్ నుంచి కేంద్రం అతన్ని దేశంలో అడుగుపెట్టనివ్వడం లేదు.