న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: రెండు డోసుల టీకా వేసుకున్నప్పటికీ, తమ దేశానికి వచ్చే భారతీయులు 10 రోజులపాటు తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండాల్సిందేనంటూ బ్రిటన్ జారీచేసిన ప్రయాణ నిబంధనలపై భారత్ మండిపడింది. ఇది ‘వివక్షాపూరితమైన విధాన’మని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని, లేదంటే ప్రతిచర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ఈ వివాదాన్ని బ్రిటన్ విదేశాంగ దృష్టికి కూడా తీసుకెళ్లాం. బ్రిటన్ది విరుద్ధమైన చర్య. వివాదంపై వీలైనంత త్వరగా మాకు సంతృప్తికరమైన చర్యలు కనిపించకపోతే, దీటుగా ప్రతిచర్యలు తీసుకునే హక్కు మాకున్నది’ అని వెల్లడించింది. ఈ అంశంపై విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్.. బ్రిటన్ విదేశాంగమంత్రితో మంగళవారం చర్చించారు. సమస్యను త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.