ప్రముఖ ఇరానియన్ ఆర్కిటెక్ట్, ఇంటీరియర్ డిజైనర్ మిలాడ్ ఎస్టీయాఘి ఇటీవలే ఒక ‘మౌంటెయిన్ హౌస్’కు రూపకల్పన చేశారు. కెనడాలోని బ్రిటీష్ కొలంబియాకు చెందిన ఒక ధనిక కుటుంబం కోసం దీనిని రూపొందించారు. ఈ భవనాన్ని క్వాడ్రా ద్వీపంలో భారీ కొండ అంచున అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిర్మించనున్నట్లు మిలాడ్కు చెందిన వెబ్సైట్లో పేర్కొన్నారు. క్లయింట్ అవసరాన్ని బట్టి ఈ ప్రాజెక్టును మూడు భాగాలుగా విభజించామనీ, రెండు కుటుంబాలు నివాసముండేలా ఇంటిని నిర్మించడంతోపాటు వినోదాలకు, క్రీడలకు ప్రత్యేక స్థలాన్ని కేటాయించినట్లు చెబుతున్నారు. ఇంట్లోని మనుషుల కదలికలను బట్టి తలుపులు, కిటికీలు స్పందిస్తాయని (తెరుచుకోవడం/మూసుకోవడం), సహజకాంతిని పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా పూర్తి పారదర్శకమైన అద్దాలు, బలమైన ఉక్కు, తీగల సాయంతో ఈ భవనాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించారు.