విజయవాడ: చిత్తూరు జిల్లాలో అమర రాజా బ్యాటరీ కంపెనీల మూసివేతకు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నోటీసులు జారీ చేసింది. నూనెగుండ్లపాడు, కరకంబాడి పరిధిలోని పరిశ్రమల మూసివేయాలని స్పష్టం చేసింది. అమర రాజా కంపెనీల నుండి ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిర్ధారించింది. చుట్టుపక్కల గ్రామాల ప్రజల రక్త నమూనాలు పరిశీలించిన అనంతరం రక్తంలో సీసం విలువలు అధికంగా ఉన్నట్టు గుర్తించింది. పరిశ్రమల చుట్టుపక్కల నివసించే ప్రజల ప్రాణాలకు ముప్పు ఉందని నిర్ధారించింది.పర్యావరణ ఉల్లంఘనలపై పలు దఫాలు కంపెనీల్లో తనిఖీలు చేపట్టిన పిసిబి అధికారులు గతంలో షోకాజ్ నోటీసులు కూడా జారీచేశారు. షోకాజ్ నోటీసులకు కంపెనీ ఇచ్చిన సమాధానంతో తృప్తి చెందని బోర్డు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందున మూసివేతకు ఆదేశించింది.