చినిగిన చొక్కా అయినా తొడుక్కో…కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో అని కందుకూరి వీరేశలింగం పంతులు చెప్పిన మాటలు ఎల్లప్పటికీ పుస్తక ప్రియుల చెవుల్లో మారుమ్రోగుతూనే ఉంటాయి. పుస్తకాల్లో దొరికే విజ్ఞానం ఎక్కడా లభించదు. పుస్తకాన్ని చదవడం అలవాటు చేసుకుంటే మంచి తృప్తిని ఇస్తుంది. అలసిన మనసులను సేద తీర్చుతుంది. అమ్మలా లాలిస్తుంది.. నాన్నలా ఆదరిస్తుంది.. గురువులా హితబోధ చేస్తుంది.. అలాంటి పుస్తకం మనకు ఓ ఆయుధం లాంటిది.
మనషులను విజ్ఞానవంతులుగా మార్చే పుస్తకాలను ఎవ్వరూ మరవకూడదు. మనషులను విజ్ఞాన భాండాగారంగా మార్చే పుస్తకాలకు ఓ గ్రామం అత్యంత విలువ ఇచ్చింది. ఆ గ్రామం గురించి తెలుసుకోవాలంటే కేరళ వెళ్లక తప్పదు.
96 శాతం అక్షరాస్యతతో కేరళ రాష్ట్రంలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. కేరళలోని అన్ని గ్రామాల్లో 100 శాతం అక్షరాస్యత ఉందని చెప్పొచ్చు. కేరళలోని పేరుమ్కులం అనే గ్రామం.. పుస్తక పఠనానికి అత్యంత విలువను ఇస్తుంది. ఈ నేపథ్యంలో ఆ గ్రామంలోకి వచ్చే రోడ్లకు ఇరువైపులా పుస్తకాల గూడును ఏర్పాటు చేశారు. ఈ పుస్తకాల గూడులో ఉపయోగకరమైన బుక్స్తో పాటు వార్తాపత్రికలను ఉంచుతారు. దారి గుండా వెళ్లే ఎవరైనా సరే.. ఆ పుస్తకాలను పఠనం చేయొచ్చు. వార్తాపత్రికలను చదువొచ్చు. ఇప్పుడు ఈ గ్రామం తొలి పుస్తక గ్రామంగా రికార్డుల్లోకి ఎక్కింది.
సెప్టెంబర్ 8న ప్రపంచ అక్షరాస్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని కేరళ టూరిజం పుస్తక గ్రామం గురించి ట్వీట్ చేసింది. ఓ వీడియోను కూడా పోస్టు చేసింది. ఈ వీడియో పుస్తక ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఎడ్యుకేషన్ సిస్టమ్కు కేరళ ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఈ వీడియోను చూస్తే అర్థమవుతుందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం కేరళ 96.2 శాతం అక్షరాస్యత సాధించింది. పురుషుల అక్షరాస్యత – 97.4 శాతం కాగా, మహిళల అక్షరాస్యత శాతం 95.2 శాతం.