పనాజీ: నార్త్ గోవాలో 24 ఏళ్ల రష్యా నటి అలెగ్జాండ్రా జావి తన అపార్ట్మెంట్లో అనుమానాస్పద రీతిలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ కేసులో గోవా పోలీసులు విచారణ చేపడుతున్నారు. అయితే ఆమె మృదేహానికి పోస్టు మార్టమ్ నిర్వహించేందుకు రష్యా కాన్సులేట్ అనుమతి కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. నార్త్ గోవాలో ఉన్న సియోలిమ్ గ్రామంలో ఉన్న అపార్ట్మెంట్లో ఉరి వేసుకుని నటి మరణించింది. ఆమె తమిళ సినిమా కాంచన-3లో నటించింది. ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని మార్చురీలో ఉంచినట్లు పోలీసులు చెప్పారు.
ఈ కేసులో ఇప్పటికే ఆమె బాయ్ఫ్రెండ్ నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. నటి అలెగ్జాండ్రా కేసులో చెన్నై ఫోటోగ్రాఫర్ను విచారించాలని అడ్వకేట్ విక్రమ్ వర్మ డిమాండ్ చేశారు. 2019లో ఆ ఫోటోగ్రాఫర్పై లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసిందామె. రష్యా నటి మృతి కేసులో అనేక కోణాలు ఉండి ఉంటాయని వర్మ తెలిపారు. ఈ కేసును పరిశీలిస్తున్నట్లు రష్యా కాన్సులేట్ తెలిపింది. గోవా పోలీసులకు సహకరించినట్లు కాన్సులేట్ చెప్పింది.